ఏపీలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి పొలిటికల్ హీట్ మొదలైంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఖాళీ కాబోయే ఈ నాలుగు స్థానాలు ఏకపక్షంగా అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఖాతాలోకే వెళ్లనున్నాయి. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ బలం ప్రకారం ఈ నాలుగు సీట్లు సొంతం చేసుకోవడం నల్లేరుపై నడకే కానుంది. అయితే, ఈ నాలుగు స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కబోతోందనే అంశంపై అమరావతి వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
Also Read : మోదీ 3.0.. ముహుర్తం ఫిక్స్..!
సామాజిక సమీకరణాల సమతుల్యతలో భాగంగా కూటమి ఈ నాలుగు సీట్లలో ఒక స్థానాన్ని కమ్మ సామాజికవర్గానికి కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఒక్క సీటు కోసం తెలుగుదేశం పార్టీలో ఇద్దరు బలమైన నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కాగా, మరొకరు విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ. ఈ ఇద్దరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.
ప్రముఖ విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గత 2014 ఎన్నికల నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, టీడీపీ తరఫున పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆయన లోక్సభ టికెట్ ఆశించినప్పటికీ వివిధ రాజకీయ సమీకరణాల వల్ల అవకాశం చేజారింది. పార్టీ కోసం ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటూ వస్తున్న రామకృష్ణ.. దశాబ్ద కాలంగా తన వంతు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. లోక్సభ స్థానం దక్కకపోవడంతో, కనీసం ఈసారైనా పెద్దల సభ కు పంపి తనకు గుర్తింపు ఇస్తారని ఆయన వర్గీయులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
Also Read : దుమారం రేపుతున్న సీజేఐ వ్యాఖ్యలు.. ఎందుకిలా..!
మరోవైపు, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా ఈ రేసులో గట్టిగా వినిపిస్తోంది. గతంలో లోక్సభలో పార్టీ తరఫున బలమైన గొంతుకగా నిలిచిన అనుభవం ఆయనకు ఉంది. జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్న గుర్తింపు జయదేవ్ కు అదనపు బలం. అయితే, గత ఎన్నికల సమయంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు రాజ్యసభ ద్వారా ఆయనను మళ్లీ పార్లమెంట్ కు పంపే ఆలోచన పార్టీ చేస్తుందా, లేక సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న భాష్యం రామకృష్ణకు అదృష్టం వరిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

