ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ జోన్ పరిధిని విస్తరిస్తూ రైల్వే బోర్డు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఒడిశాలోని ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలో ఉన్న 7 ముఖ్యమైన రైల్వే స్టేషన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు తాజా ఆదేశాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న ఏడు రైల్వే స్టేషన్లు ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి.
Also Read : బాబు మాస్టర్ స్ట్రోక్.. అమరావతికి ‘చట్ట రక్షణ’
గతంలో ఇవి తూర్పు కోస్తా రైల్వేలోని ఖుర్దా డివిజన్ కింద ఉండేవి. భౌగోళికంగా ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ, పరిపాలనాపరంగా ఒడిశా డివిజన్ పరిధిలో ఉండటంతో స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. తాజా నిర్ణయంతో ఈ సమస్యలకు చెక్ పడనుంది. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, బారువ, మందస రోడ్, సుంబిదేవి, పలాస స్టేషన్ లు బదిలీ చేసారు. ఈ స్టేషన్లు దక్షిణ కోస్తా జోన్లోకి మారడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా రైళ్ల సమయాల్లో మార్పులు, కొత్త స్టాపింగ్ల ఏర్పాటు సులభతరం కానుంది.
Also Read : బ్రేకింగ్; పేర్ని నానికి షాక్ ఇచ్చిన పోలీసులు..!
స్టేషన్ల ఆధునీకరణ, ప్లాట్ఫారమ్ విస్తరణ వంటి పనులకు నిధుల కేటాయింపు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల ఫిర్యాదులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఇకపై ఒడిశా అధికారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదట. విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు పనులు వేగవంతం అవుతున్న తరుణంలో, రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో జోన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత రైల్వే ముఖచిత్రం మారిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.

