సాధారణంగా అధికార పార్టీలు ప్రవేశపెట్టే బిల్లులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన బిల్ విషయంలో మాత్రం అన్ని పార్టీలు జై కొట్టాయి. ఏ ప్రశ్న లేకుండా.. చర్చలో పాల్గొని జయహో అమరావతి అన్నాయి. ఫలితంగా అమరావతి విషయంలో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం, ప్రజా రాజధాని అమరావతికి దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్లో సర్వసమ్మతమైన మద్దతు లభించింది.
Also Read : బాబు మాస్టర్ స్ట్రోక్.. అమరావతికి ‘చట్ట రక్షణ’
ఏప్రిల్ 1, 2న జరిగిన కీలక పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026 ఉభయ సభల్లోనూ ఘన విజయం సాధించింది.ఈ బిల్లు విషయంలో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం విశేషం. అధికార ఎన్డీయే కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలతో పాటు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అలాగే సమాజ్ వాదీ పార్టీ వంటి ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా అమరావతికి పూర్తి మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ, అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా హైదరాబాద్, బెంగళూరు తరహాలో ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు.
Also Read : బాబుకి తలనొప్పిగా మారుతున్న ఎమ్మెల్యేలు.. చర్యలెక్కడ?
ఈ ఐక్యత ఏపీ అభివృద్ధికి దేశవ్యాప్తంగా ఉన్న మద్దతును చాటిచెప్పింది అంటున్నారు పరిశీలకులు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5కు చేసిన ఈ సవరణ ద్వారా, ఇప్పటివరకు ఉన్న ఉమ్మడి రాజధాని క్లాజును తొలగించి, “ఆంధ్రప్రదేశ్ ఏకైక మరియు శాశ్వత రాజధానిగా అమరావతి”ని అధికారికంగా చేర్చారు. ఇది జూన్ 2, 2024 నుండి అమల్లోకి వచ్చేలా చట్టబద్ధత కల్పించారు. దీనివల్ల భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి అస్థిరతలకు తావు లేకుండా బలమైన పునాది పడింది. పార్లమెంట్లో అంతా ఒకవైపు ఉంటే, వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించింది. రాజధాని రైతులకు ఇవ్వాల్సిన పరిహారం, ఇతర డిమాండ్లను బిల్లులో చేర్చలేదని పేర్కొంటూ ఆ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం.

