రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలపై ప్రతిపక్ష వైసీపీ ఎన్ని కుట్రలు, తప్పుడు ఆరోపణలు చేసినా తాము వెనక్కి తగ్గేదే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత ధీమాగా ప్రకటించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నియామక ప్రక్రియపై విషం చిమ్ముతున్నారని, ఇలాంటి చౌకబారు విమర్శలకు భయపడే ప్రభుత్వం ఇది కాదని తేల్చిచెప్పారు.
Also Read : స్థానిక సమరానికి జగన్ భయపడుతున్నాడా..?
గత వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగుల గొంతు కోశారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. నాడు డీఎస్సీ ఊసే ఎత్తని జగన్ రెడ్డి, నేడు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటిస్తే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. అసలు పరీక్షల నిర్వహణపై, నియామకాలపై కనీస అవగాహన లేని వారు కుంభకోణాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా, కోర్టుల చుట్టూ తిరిగినా నిరుద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా తాము ముందుకెళ్తామన్నారు.
Also Read : వైసీపీ నుంచి సజ్జల అవుట్..?
ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ప్రతి ఏటా 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ను కూడా విడుదల చేయడానికి విద్యాశాఖ అంతా సిద్ధం చేస్తోందని తెలిపారు. వైసీపీ ఎన్ని ఆరోపణలు చేసినా నిరుద్యోగుల కలలను నిజం చేసే విషయంలో తగ్గేది లేదని లోకేష్ కుండబద్దలు కొట్టారు.

