Friday, August 7, 2026 12:20 PM
Friday, August 7, 2026 12:20 PM

డీలిమిటేషన్‌కు జెన్-జీ ఎఫెక్ట్..!

దేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుందని భావించిన వర్షాకాల సమావేశాలు అనూహ్య పరిణామాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఒకే దేశం – ఒకే ఎన్నికల విధానాన్ని తీసుకురావడంతో పాటు.. నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు తక్షణమే రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణల ద్వారా తమ రాజకీయ పై చేయిని నిలబెట్టుకోవాలని భావించిన కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు అనూహ్యంగా ప్రతిఘటనను ఎదుర్కుంటున్నాయి. మిత్రపక్షాల మద్దతును సమకూర్చుకుని.. అవసరమైన సంఖ్యాబలంతో ప్రతిష్టాత్మక బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ సభ లోపల విపక్షాలు, వెలుపల విద్యార్థి లోకం ప్రదర్శించిన ఏకీకృత నిరసన అధికార పక్షాన్ని తాత్కాలికంగా ఆత్మరక్షణలో పడేసింది.

Also Read : వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్..!

ఈ రాజకీయ సంచలనం వెనుక ప్రధాన శక్తిగా డిజిటల్ యుగంలో పెరిగిన ‘జెన్-జీ’ యువత ఆందోళన నిలిచింది. పోటీ పరీక్షల్లో పారదర్శకత లోపించడం, పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యలు, రాజ్యాంగపరమైన మార్పులపై వ్యక్తమవుతున్న అసంతృప్తితో యువత భారీ ఎత్తున ఢిల్లీ వీధుల్లోకి రావడం ఉద్యమానికి సరికొత్త రూపాన్ని ఇచ్చింది. సాంప్రదాయ నిరసనలకు భిన్నంగా సోషల్ మీడియా వేదికగా వినూత్న రీతిలో హల్‌చల్ చేస్తూ వీధుల్లో ఊపందుకున్న ఈ ఉద్యమం చట్టసభల వాతావరణాన్ని సైతం వేడెక్కించింది. లోపల విపక్ష ‘ఇండియా’ కూటమి ఈ అవకాశాన్ని రాజకీయంగా విస్తృతంగా వాడుకుంది.

ఉద్యోగ భద్రతపై యువత లేవనెత్తిన ప్రశ్నలతో పాటు, నియోజకవర్గాల పునర్విభజన పల్ల దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే అభ్యంతరాలను సభలో గట్టిగా వినిపిస్తూ సభా కార్యక్రమాలను ఇండియా కూటమి పూర్తిగా స్తంభింపజేసింది. వాస్తవానికి ఈ బిల్లులను చట్టసభల్లో గట్టెక్కించేందుకు అవసరమైన మూడింట రెండొంతుల సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏకపక్షంగా ముందడుగు వేయడానికి వెనకాడటానికి ప్రధాన కారణం ప్రజాభిప్రాయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తీవ్ర గందరగోళం, వీధి పోరాటాల నడుమ బలవంతంగా రాజ్యాంగ సవరణలు చేపడితే ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారనే ముద్ర పడే ప్రమాదం ఉంది. పైగా యువత నిరసనల మధ్య తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాతోనే కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా అడుగు వెనక్కి వేసినట్లు కనిపిస్తోంది.

Also Read : స్కూల్స్ వద్ద నో జంక్ ఫుడ్.. గవర్నమెంట్ ఆర్డర్..!

ఈ పరిణామాల క్రమంలోనే రచ్చ లేని వాతావరణంలో ఈ చారిత్రక బిల్లులపై సమగ్ర చర్చ జరగాలంటే ప్రత్యేక సమావేశాలే ఏకైక మార్గమని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం. స్వాతంత్య్ర దినోత్సవాల అనంతరం కేవలం ఈ రాజ్యాంగ సవరణల అజెండాతోనే పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. వర్షాకాల సమావేశాల రాజకీయ హోరు నుంచి ప్రధాన అంశాన్ని వేరు చేసి, కేవలం చట్టసభల పునర్విభజన, ఎన్నికల సంస్కరణల పైనే దృష్టి సారించడం ద్వారా విపక్షాల దాడి.. తీవ్రతను తగ్గించవచ్చని కేంద్రం యోచిస్తోంది. వీధుల నుంచి పార్లమెంట్ వరకు అలముకున్న ఈ ఉత్కంఠ వాతావరణం తాత్కాలికంగా ముగిసినట్లే కనిపిస్తున్నప్పటికీ ప్రత్యేక సమావేశాల వేదికగా ఈ కీలక బిల్లులు ఏ రూపు దాల్చుతాయో వేచి చూడాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎలా చెబితే అర్థం...

సాధారణంగా ఒక నానుడి ఉంది. అదేమిటంటే.....

ఇంట్రస్టింగ్ గా సీఎం...

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం...

పక్కన పెడతారా.. ఉద్యమిస్తారా..?...

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర...

పొగాకు రైతులపై జగన్‌...

దేవరాపల్లిలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు...

వైసీపీ ఫేక్ ప్రచారానికి...

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం...

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది ఎవరూ..?

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం...

పోల్స్