తెలుగు చలనచిత్ర పరిశ్రమకు గుండె కాయలాంటి నగరమైన బెజవాడలో ప్రముఖ థియేటర్ అలంకార్ అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. ఒక అరుదైన మైలురాయిని, ఎప్పటికీ నిలిచిపోయే సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో ఎంతో ఘనమైన చరిత్ర, క్రేజ్ కలిగిన సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి, ఈ థియేటర్ కు మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు ఒక అద్భుతమైన సెంటిమెంట్ గా మారింది. ఈ ఘట్టమనేని వంశానికి చెందిన ఏకంగా నాలుగు తరాల హీరోల తొలి చిత్రాలు ఒకే థియేటర్ లో విడుదల కావడం విశేషం.
Also Read : ఆ బౌలర్ టీంలో ఉండాల్సిందే.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నటుల మొదటి సినిమాలు ఒకే టాకీస్ లో రిలీజ్ కావడం.. తెలుగు సినీ చరిత్రలోనే కాదు, భారత చలనచిత్ర రంగంలోనే ఒక అరుదైన విశేషంగా సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ అపూర్వమైన ప్రస్థానం ఘట్టమనేని నటవారసత్వానికి పునాది వేసిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన మొదటి చిత్రం తేనెమనసులు.. తో ప్రారంభమైంది. ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించిన ఈ సినిమా అలంకార్ థియేటర్ లోనే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
Also Read : అంతర్జాతీయ అద్భుతం.. మన భోగాపురం..!
ఆ తర్వాత కృష్ణ నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా వెండితెరకు పరిచయమైన సామ్రాట్.. చిత్రం కూడా ఇదే థియేటర్ లో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇదే పరంపరను విజయవంతంగా కొనసాగిస్తూ, ప్రస్తుత స్టార్ హీరో.. కృష్ణ చిన్న కుమారుడు మహేష్ బాబు కథానాయకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు సినిమా కూడా అలంకార్ థియేటర్ లోనే తొలి ప్రదర్శనను జరుపుకుని ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ ఘట్టమనేని వంశం నుంచి నాలుగో తరం హీరో, కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు వారసుడు జయకృష్ణ హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.
ఆయన నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం కూడా ఇదే అలంకార్ థియేటర్ లోనే విడుదల అయింది. ఈ చిత్ర విడుదల ప్రకటనతో కృష్ణ కుటుంబం నుంచి వరుసగా నాలుగు తరాల హీరోల మొదటి సినిమాలు ఒకే థియేటర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనట్లయింది. ఒకే వేదికపై ఒకే వంశానికి చెందిన నాలుగు తరాల నటుల తొలి సినిమాలు ప్రదర్శితం కావడం అనేది ఒక అరుదైన ఘనతగా రికార్డు కెక్కింది. ఈ అపూర్వమైన సెంటిమెంట్, రికార్డుపై ఘట్టమనేని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

