తెలంగాణలోని షాద్ నగర్ లో పోక్సో నిందితుడు రాజ్ కుమార్ బెయిల్ పై బయటకు వచ్చి, పగతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా నరికి చంపిన ఉదంతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. చట్టాల్లోని లొసుగుల వల్లే ఇలాంటి మృగాలకు సులభంగా బెయిల్ దొరుకుతోందని, చిన్నారుల ప్రాణాలతో ఆడుకునే నిందితులకు సమాజంలో తిరిగే అర్హతే లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. పోక్సో కేసుల్లో ఇరుక్కున్న నిందితులకు ఎలాంటి పరిస్థితుల్లోనూ బెయిల్ రాకుండా ప్రభుత్వాలు కోర్టుల్లో గట్టిగా పోరాడాలని పవన్ కల్యాణ్ కోరారు.
Also Read : కాంగ్రెస్కు రాములమ్మ గుడ్ బై..?
నిందితుల బెయిల్ పిటిషన్లను ప్రాథమిక దశలోనే తీవ్రంగా వ్యతిరేకించాలని, బాధిత కుటుంబాల జోలికి వస్తే ఉరిశిక్ష పడేలా చట్టాలను మరింత కఠినతరం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి బెయిల్ ఇస్తే బాధితుల ప్రాణాలకే ముప్పు వస్తుందనడానికి షాద్ నగర్ ఘోరమే నిదర్శనమన్నారు. చిన్నారులపై జరిగే అఘాయిత్యాల విషయంలో పోలీసుల అలసత్వాన్ని ఏమాత్రం సహించకూడదని పవన్ కల్యాణ్ కోరారు. ప్రాథమిక విచారణల పేరుతో కాలయాపన చేయకుండా, ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేసారు.
Also Read : పవన్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వంపై భారం పడకుండా..!
దర్యాప్తుకు ఒక నిర్దిష్ట కాలపరిమితి విధించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు అతి తక్కువ సమయంలోనే కఠిన శిక్షలు పడేలా వేగంగా అడుగులు వేయాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 39 ప్రకారం బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. మృగాలపై కేసు పెట్టిన తర్వాత బాధిత కుటుంబాలకు, సాక్షులకు ప్రభుత్వం తరఫున పటిష్టమైన రక్షణ కల్పించాలని కోరారు. సమాజంలో చిన్నారుల భద్రతకు ముప్పు వాటిల్లితే సహించకూడదు అని, ఇలాంటి ఘోరాలకు పాల్పడే నిందితుల పట్ల ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కల్యాణ్ కోరారు.

