తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
Also Read : సీమలో భూమి బంగారం..! ఎకరా ధర వింటే షాక్..!
పువ్వాడ మాట్లాడుతూ, ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. అదే సమయంలో దిగువ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తరలిస్తూ వ్యవసాయానికి అవసరమైన సాగునీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా “చంద్రబాబుకు ఉన్న నీటి సోయి రేవంత్ రెడ్డికి కూడా రావాలి” అంటూ వ్యాఖ్యానించారు.
Also Read : కూటమి ప్రభుత్వంలో పవన్ మాటే ఫైనల్..?
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందుబాటులో ఉన్న నీటిని వినియోగించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని పువ్వాడ విమర్శించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే సాగునీటి ప్రణాళికలను అమలు చేయాలని, నీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించి వ్యవసాయానికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించింది రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకేనని, ఆంధ్రప్రదేశ్కు నీటిని ధారాదత్తం చేయడానికి కాదని పువ్వాడ వ్యాఖ్యానించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పువ్వాడ అజయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం, సాగునీటి నిర్వహణ, తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ఆయన చేసిన విమర్శలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

