భారత్ లో ఆల్కహాల్ కలిగిన సిరప్లు, టోనిక్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ రూల్స్, 1945 నిబంధనలకు సవరణలు చేస్తూ.. 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి, 30 మిల్లీ లీటర్ల కంటే పెద్ద సీసాలలో విక్రయించే అన్ని రకాల నోటి ద్వారా తీసుకునే లిక్విడ్ మందులను షెడ్యూల్ హెచ్1 పరిధిలోకి తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొన్ని రకాల దగ్గు మందులు, ఇతర హెల్త్ టోనిక్లను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేసి, మత్తు కోసం అధిక మోతాదులో తాగుతున్నారనే ఫిర్యాదులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినతరం చేసింది.
Also Read : కొరియా స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన లోకేష్..!
ఈ తాజా సవరణతో ఇకపై సదరు మందులను సాధారణ ఓటీసీ ప్రొడక్ట్స్లా నేరుగా కొనుగోలు చేయడానికి వీలుండదు. ఫార్మసీలు లేదా మెడికల్ షాపుల యజమానులు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ చూపిస్తేనే ఈ మందులను కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సదరు మందుల విక్రయాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయడానికి మెడికల్ షాపులు ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ను నిర్వహించాలి. ఆ రికార్డులను, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లను కనీసం మూడు సంవత్సరాల పాటు భద్రపరిచి, డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలకు సిద్ధంగా ఉంచడం తప్పనిసరి.
Also Read : అంతా ఓపెన్.. రావణ్కు జగన్ మద్దతు..!
అయితే, ఈ మార్పుల వల్ల సదరు మందులపై ఎలాంటి నిషేధమూ విధించలేదని, అవి వాడటానికి సురక్షితం కాదనే భావన తప్పు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఔషధాలలో స్థిరత్వం కోసం ఇథైల్ ఆల్కహాల్ ను సాల్వెంట్ గా వాడటం వైద్యపరంగా సాధారణమే. కాకపోతే, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ మందులు కేవలం సరైన వైద్య పర్యవేక్షణలోనే వాడేలా చూడటమే ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశం. జెన్యూన్గా మందులు అవసరమయ్యే రోగులు తమ డాక్టర్ రాసిచ్చిన చిట్టీని చూపించి ఎప్పటిలాగే వీటిని మెడికల్ షాపుల్లో పొందవచ్చు.

