ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారిన.. రెవెన్యూ సమస్యల మీద చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా బనగానపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ఇద్దరు మహిళలు తమ భూ వివాదాలను పరిష్కరించాలని నేరుగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లాకు చెందిన రామలక్ష్మమ్మ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయి దీప్తి అనే ఇద్దరు మహిళలు సభా వేదికపైకి వచ్చి తమ ఆవేదనను సీఎం చంద్రబాబుకు వివరించారు.
Also Read : వెలగపూడికి చెక్ పెడుతున్నారా..?
వారి సమస్యలను ఎంతో ఓపికగా విన్న ముఖ్యమంత్రి, వేదికపైనే ఆ భూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహిళల అభ్యర్థనపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను ఆదేశించారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వెంటనే మాట్లాడి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఎంవో ఉన్నతాధికారులు.. కడప, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఈ మహిళల భూ సమస్యలను తీసుకెళ్లారు.
Also Read : టెట్పై వైసీపీ రాజకీయాలు బట్టబయలు?
బాధితుల దరఖాస్తులను పరిశీలించి, త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎంవో అధికారుల సూచనల మేరకు కడప, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టరేట్లకు రావాల్సిందిగా బాధితులైన రామలక్ష్మమ్మ, సాయి దీప్తిలకు అధికారికంగా పిలుపు వచ్చింది. సుదీర్ఘకాలంగా నలుగుతున్న తమ భూ వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా వేదికపైనే స్పందించి, కలెక్టర్లను ఆదేశించడం పట్ల సదరు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న ఈ చొరవను సభకు హాజరైన ప్రజలు సైతం ప్రశంసించారు.

