వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ సమావేశంలో సమగ్ర ఓటర్ జాబితా సవరణ (SIR) ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో లక్షలాది ఓట్లు తొలగించబడటం వల్ల అక్కడి అధికార పార్టీలైన టిఎంసి, DMK నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా తలెత్తే అవకాశం ఉందని చెబుతూ, వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లు లక్ష్యంగా చేసుకుని తొలగించే ప్రయత్నాలు జరుగవచ్చని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Also Read : మోదీ సర్కార్కు పుష్కరం.. బీజేపీ భారీ ప్లానింగ్..!
ప్రతి నియోజకవర్గంలో ఓటర్ జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి, ఎక్కడైనా పేర్లు తొలగిస్తే వెంటనే స్పందించాలని పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలపై ఈ ప్రక్రియ ప్రభావం చూపవచ్చని జగన్ హెచ్చరించినట్లు సమాచారం. గత ఎన్నికల అనంతరం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన జగన్, ఇప్పుడు ‘SIR’ ప్రక్రియపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధిక సంఖ్యలో ఓట్లు పోలవడం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు, కూటమి పార్టీలు అక్రమ ఓటింగ్కు పాల్పడ్డాయనే సంకేతాన్ని ఇస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read : మన టార్గెట్.. జెన్ జీ, ఆల్ఫా జెన్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
అయితే మరోవైపు మూడు రాజధానుల నిర్ణయం, పాలనాపరమైన వివాదాలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలే వైసీపీ పరాజయానికి కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే జగన్ మాత్రం 2029 ఎన్నికల నాటికి కూడా ‘SIR’ పేరుతో వైసీపీకి నష్టం కలిగించే ప్రయత్నాలు జరుగవచ్చని భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. భవిష్యత్తులో ఓటమికి ఇదే ఒక కారణంగా మారవచ్చని ఇప్పటినుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ, ఓటర్ జాబితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

