90వ దశకంలో దక్షిణ భారత సినీ పరిశ్రమను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ప్రముఖ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖంగా వినిపించే పేరు సాక్షి శివానంద్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన ఇద్దరు మిత్రులు, అలాగే మహేష్ బాబుతో కలిసి చేసిన యువరాజు, రాజశేఖర్ తో నటించిన సింహరాశి వంటి చిత్రాలు ఆమెకు విశేషమైన ప్రజాదరణ తీసుకువచ్చాయి.
Also Read : దుర్గేశ్ పై పవన్ సీరియస్.. మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు..?
1993లో విడుదలైన అన్న వదిన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాక్షి, ఆ తర్వాత వరుస అవకాశాలతో అగ్ర హీరోయిన్ల సరసన చేరారు. మాస్టారు, రాజహంస, కలెక్టర్ గారు, యమజాతకుడు, హోమం వంటి చిత్రాలతో ఆమె కెరీర్ శిఖరాగ్రానికి చేరుకుంది. తన అందం, సహజ నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
అయితే, ఆమె సినీ ప్రయాణంలో ఒక దశలో బాలీవుడ్ అండర్వరల్డ్ ప్రభావం తీవ్రంగా ఎదురైంది. అప్పట్లో బాలీవుడ్లో అండర్వరల్డ్ ప్రభావం అధికంగా ఉండేది. సినిమా నిర్మాణాలు, నిర్ణయాలపై కూడా వారి ప్రభావం ఉండేదనే వార్తలు వినిపించేవి. ఈ పరిస్థితులు అనేకమంది నటీమణుల కెరీర్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. సాక్షి శివానంద్ జీవితంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
కెరీర్ మంచి స్థాయిలో కొనసాగుతున్న సమయంలో ఆమెకు అండర్వరల్డ్కు చెందిన వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. తాను నటిస్తున్న ఓ సినిమా నిర్మాతకు అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఆమె తీవ్ర భయానికి గురయ్యారు. అనంతరం బాలీవుడ్కు దూరమై, తెలుగు మరియు కన్నడ చిత్రాలపై దృష్టి సారించారు.
Also Read : టీపీసీసీ గౌడ్కు పొగ.. కారణం అదేనా..!
2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాక్షి శివానంద్ తన అనుభవాలను వెల్లడిస్తూ, “ఆ నిర్మాతకు అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని తెలిసినప్పుడు నేను భయపడ్డాను. అందుకే బాలీవుడ్ను వదిలి దక్షిణాది సినిమాల్లో నటించడం ప్రారంభించాను. అందరితో సంబంధాలు తెంచుకున్నాను. ఆ సమయంలోనే నా బాలీవుడ్ కెరీర్ ముగిసిపోయిందని అర్థమైంది. భయపడకుండా కొనసాగి ఉండి ఉంటే, బహుశా ఇప్పటికీ బాలీవుడ్లో కొనసాగేదాన్ని. కానీ పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి పూర్తిగా దూరమయ్యాను. ఒక నిర్మాత నిరంతరం ఫోన్ చేయడంతో నా ఫోన్ నంబర్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది. నేను ఎక్కడ ఉన్నానో ఎవరికీ తెలియకుండా జీవించాను. ఆ నిర్ణయం వల్ల నా కెరీర్ను కోల్పోవాల్సి వచ్చింది” అని తెలిపారు.
ప్రస్తుతం సాక్షి శివానంద్ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా అరుదుగానే కనిపిస్తున్నారు.

