అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు, ఆ పార్టీ యువజన విభాగం నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఉమామహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. గతేడాది రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఉమామహేశ్వర్ రెడ్డి రైలు పట్టాలపై పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Also Read : కమ్మ నేతకు రాజ్యసభ..? ఆ ఒక సీటు ఎవరికి..?
అయితే, చనిపోవడానికి ముందు ఆయన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలు సంచలన పోస్టులు పెట్టారు. తోపుదుర్తి కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఉమామహేశ్వర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఆత్మహత్య కేసుకు సంబంధించి సాంకేతిక ఆధారాలను సేకరించడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
Also Read : మహిళా పోలీసు తీరు సిగ్గు సిగ్గు..!
మృతుడి మొబైల్ ఫోన్, ఇతర పరికరాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, కీలకమైన డేటాను రికవరీ చేసింది. ఉమామహేశ్వర్ రెడ్డిని మానసికంగా వేధించినట్లు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ల్యాబ్ నివేదిక ద్వారా పక్కా ఆధారాలు లభించడంతోనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ పక్కా సాక్ష్యాల ఆధారంగానే తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి సోదరుల హవా సాగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులన్నింటిపై విచారణ వేగవంతం కావడం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

