రాజు తలచుకుంటే.. నేరచరితులైనా సరే.. ఇప్పుడు ఈ మాట ఏపీలో బాగా వినిపిస్తోంది. ఏపీలో 3 వేల 570 కోట్ల లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులను సిట్ అధికారులు అరెస్టు కూడా చేశారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. జైలుకెళ్లి సుమారు 70 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా మిథున్ రెడ్డి కూటమి సర్కార్కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే మిథున్ రెడ్డికి ప్రధాని మోదీ అరుదైన గౌరవం ఇచ్చారు.
Also Read :బ్రేకింగ్: నిన్న నో.. నేడు ఎస్.. మరో కరూర్ కి పోలీసులు రెడీ నా ?
అమెరికాలో అక్టోబరు 27 నుంచి జరగబోయే ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి 16 మంది సభ్యుల భారత బృందంలో మిథున్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చారు ప్రధాని మోదీ. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. టీడీపీ, జనసేన ఎంపీలు ఉన్నప్పటికీ వారిలో ఏ ఒక్కరికి ఈ జాబితాలో అవకాశం రాలేదు. ఈ బృందానికి రాజమండ్రి లోక్సభ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహిస్తున్నారు. కూటమిలో భాగస్వామ్యులకు అవకాశం ఇవ్వకుండా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు కల్పించడం ఆశ్చర్యమనే చెప్పాలి. ఈ ప్రకటన వచ్చిన వెంటనే మిథున్ రెడ్డి తన పాస్పోర్టు కోసం కోర్టుకు కూడా వెళ్లారు.
వైసీపీ తరఫున నలుగురు ఎంపీలు లోక్సభకు ఎన్నికయ్యారు. తిరుపతి, రాజంపేట, అరకు, కడప పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. ఈ నాలుగు స్థానాల్లో కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, అరకు నుంచి గుమ్మా తనుజా రాణి ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలకు అవకాశం కల్పించాలని అనుకుంటే.. జైలుకెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి కాకుండా వైసీపీలో తిరుపతి, అరకు పార్లమెంట్ సభ్యులకు చోటు కల్పించి ఉంటే.. విమర్శలు వచ్చేవి కావు. వివేకా హత్య కేసులో అవినాష్ బెయిల్ పై ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి జైలు కెళ్లారు. అరకు, తిరుపతి ఎంపీలపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవు.
Also Read :వన్డే సీరీస్ కు ముందు ఆసిస్ కు షాక్..!
కోట్లు కొల్లగొట్టిన నేర చరిత్రులంటే మోదీకి మహా ఇష్టమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకుని 16 నెలలు జైలులో ఉన్న జగన్.. పుష్కర కాలంగా బెయిల్పై బయటే తిరుగుతున్నారు. చివరికి కోర్టు వాయిదాలకు వెళ్లటం లేదంటే.. దీని వెనుక ఢిల్లీ పెద్దల అండదండలు బాగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఆర్థిక నేరస్తుడిగా ఉన్న జగన్ పైన మోదీకి ఎందుకు ఇంత ప్రేమ అనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. జగన్ పై చర్యలు తీసుకోవాలని.. కేసులను త్వరితగతిన విచారణ జరిపించాలని స్వయంగా నాటి వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రధాని మోదీకి, హోమ్ మంత్రి అమిత్ షాకు వినతి పత్రం ఇచ్చినా కూడా పెద్దగా ఫలితం లేదు.
ఇక మిథున్ రెడ్డి విషయంలో మోదీ ఇలా వల్లమాలిన ప్రేమ ఒలకబోయడంలో అంతరార్థం లేకపోలేదు. వైసీపీలో జగన్ తర్వాత అంతటి ఆర్థిక, అంగబలం ఉన్న నాయకుడు మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావడమే.అటువంటి పెద్దిరెడ్డి తమ కేసుల నుంచి బయటపడటం కోసం బీజేపీలో చేరేందుకు రాయబారాలు నడుపుతున్నారనే వదంతులు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనడానికి తార్కాణంగా మిథున్ రెడ్డిని ఐక్య రాజ్య సమితికి వెళ్లే బృందంలో కలిపేశారనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Also Read :నందమూరి బాలకృష్ణ వారసురాలిగా…!
అమెరికాలో మిథున్ రెడ్డిని చూసిన ఎన్నారైలు.. ఈయన మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు కదా.. ఇంతకంటే ఇండియాలో మంచోడే దొరకలేదా అని ఆశ్ఛర్యపోవడం ఖాయం. ఇక మిథున్ రెడ్డికి ఐక్యరాజ్య సమితి బృందంలో అవకాశం ఇవ్వడాన్ని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ నేతపై అకారణంగా తప్పుడు ఆరోపణలు చేశారని.. మిథున్ రెడ్డి ఎలాంటి అవినీతి చేయలేదు కాబట్టే.. ఆయనను మోదీ ఎంపిక చేశారని గొప్పగా ప్రచారం చేస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టించిన మిథున్ రెడ్డికి బీజేపీ అరుదైన గౌరవం ఇవ్వటం ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలకు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. లిక్కర్ స్కామ్లో సొమ్ము బిగ్ బాస్కు చేరడం వెనుక మిథున్ రెడ్డి హస్తం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మిథున్ రెడ్డికి కేంద్రం అండగా ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. మిథున్ రెడ్డి లిక్కర్ కేసు కూడా ఇక మూలనపడుతుందడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు కూడా.