దేశంలో నకిలీ ఓట్లను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఎన్నికలు జరగనున్న బీహార్ లో మొదలుపెట్టి.. దేశం అంతటా ఓటర్ల జాబితాలను సవరించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం రాజకీయ తుఫానుకు దారితీసే విధంగానే కనపడుతోంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుండి పౌరులు కానివారిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Also Read : శంకర్ కు సాధ్యంకాని విజయం శేఖర్ కు ఎలా సాధ్యమైంది?
అసలు పౌరులు కానివారు మొదట ఓటర్లుగా ఎలా మారారు? అనేది ప్రధాన ప్రశ్న. దీనికి ఫారం 6లో సమాధానం ఉంది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఫారం 6, 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయులు.. తమ నివాస ప్రాంతంలో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటర్ల జాబితా నుండి పౌరులు కాని వారిని తొలగించడానికి ఈసీ ప్రయత్నిస్తుండగా, ఫారమ్ 6 లోని లోపం విమర్శలకు దారి తీసింది.
ఫారమ్ 6 దరఖాస్తుదారులు తాము భారతీయులమని నిరూపించుకోవడానికి ఎటువంటి పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. కేవలం డిక్లరేషన్, పుట్టిన తేదీ, చిరునామా సరిపోతుంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం మాత్రం.. పౌరులు కాని వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోంది. 2003-2004లో ఈ స్థాయిలో ఓట్ల సవరణ జరిగింది. భారతదేశంలో 2 కోట్ల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నారని అప్పటి హోం మంత్రి కిరణ్ రిజిజు 2016లో పార్లమెంటుకు తెలిపారు. ఇప్పుడు వారి సంఖ్య భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : గంటాకు కోపం వచ్చింది.. ఈసారి నేరుగానే..!
బీహార్లో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా, జూన్ 24న ఎన్నికల సంఘం 11 పత్రాల జాబితాను విడుదల చేసింది , వాటిలో ఒకటి పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కేటాయించారు. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, పెన్షన్ చెల్లించే ఆర్డర్, జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, నివాసం, కులం లేదా అటవీ హక్కు ధృవపత్రాలు 11 పత్రాలలో ఉన్నాయి. ఈ జాబితాలో ఆధార్ కార్డు, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేవు, వీటిని సాధారణంగా దేశం అంతటా గుర్తింపు పత్రాలుగా ఉపయోగిస్తారు. ఆధార్ పౌరసత్వాన్ని నిరూపించే అవకాశం లేదని ఎన్నికల సంఘం చెప్తోంది.