ఐదేళ్ల పాటు మూడు రాజధానుల జపంతో రాజధాని అంశాన్ని చర్చల్లో లేకుండా చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఇప్పుడు మరో కొత్త రాగంతో తెరపైకి వచ్చారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో, మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ పేరుతో ఆయన చేసిన ప్రతిపాదనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని ఈ గ్రోత్ ఇంజిన్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఎలా గుర్తొచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read : నవ్యాంధ్ర చరిత్రలో కీలక అడుగు.. నేడు పార్లమెంట్ లో కీలక పరిణామం..!
గత ఐదేళ్లుగా అమరావతిని శ్మశానం అని, గ్రాఫిక్స్ అని అవహేళన చేసిన జగన్, ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్లను క్యాపిటల్ కారిడార్ గా ప్రకటించాలని కోరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను రోడ్డున పడేసి, ఇప్పుడు అదే ప్రాంతంపై ప్రేమ ఒలకబోయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది స్పష్టమవుతోంది అంటున్నారు పరిశీలకులు. అమరావతికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించే బిల్లు పార్లమెంట్లో ఉన్న సమయంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణం కనిపిస్తోంది.
Also Read : ఈసారి మావిగన్ అంటున్న జగన్
బిల్లుకు మద్దతు ఇవ్వలేక, అలాగని బహిరంగంగా వ్యతిరేకించలేక.. ప్రజల దృష్టిని మళ్ళించడానికి ‘మావిగన్’ అనే కొత్త పదాన్ని సృష్టించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు అమరావతి అభివృద్ధికి లక్షల కోట్లు ఖర్చవుతాయని, అది సాధ్యం కాదని విమర్శిస్తూనే.. మరోవైపు 110 కిలోమీటర్ల కారిడార్ను అభివృద్ధి చేయాలని చెప్పడంలో అర్థం లేదనే విమర్శలు వస్తున్నాయి. 40 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో కాస్త ఖర్చు పెడితే అభివృద్ధి జరుగుతుందని జగన్ అనడం ఆయన అపరిపక్వతను సూచిస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఏది ఎలా ఉన్నా.. ఇప్పుడు కొత్త పేర్లతో ప్రజలను మళ్ళీ గందరగోళానికి గురిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా పార్లమెంట్ లో బిల్ ప్రవేశ పెడుతున్న సమయంలో జగన్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

