బీహార్ ముఖ్యమంత్రి ఎవరు..? ఈ ప్రశ్నకు గత రెండు దశాబ్దాలుపైగా వినపడిన నితీష్ కుమార్. ఎమ్మెల్సీగా సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు నిర్వర్తించిన నితీష్ కుమార్ ఇప్పుడు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మళ్ళీ సిఎం అయిన ఆయన.. ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. కాసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేసారు. ఆయనతో పాటుగా జనతాదళ్ (యునైటెడ్) నుంచి మరో అభ్యర్థి రామ్నాథ్ ఠాకూర్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తారు.
Also Read : ఆయన సీఎంఓలో కాలకేయుడు..!
అయితే మార్చ్ 16న రాజ్యసభకు ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఆయన సిఎంగా కొనసాగే అవకాశం ఉంది. నామినేషన్ ప్రక్రియ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాట్నాలో ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నితీష్ కుమార్ సహా ఎన్డియే పార్టీల నాయకులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో బీహార్లో భవిష్యత్ రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు ఉండటంతో బిజెపి నేత.. సిఎం కానున్నారు.
Also Read : ఆ సినిమాకు లైన్ క్లియర్.. అన్నీ వాయిదా..!
ఇక అధికార మార్పిడిలో భాగంగా నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తే.. ఒప్పందంలో భాగంగా జెడి(యు)కి రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వవచ్చు. ఇక బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్, శివేష్ కుమార్ నామినేషన్లు దాఖలు చేయనుండగా, రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా పోటీ చేయనున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో లోక్సభ, రాజ్యసభ మరియు బీహార్ శాసనసభ ఉభయ సభలలో పనిచేసిన నేతగా నితీష్ కుమార్ గుర్తింపు సంపాదించారు.

