తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 15 నెలలు దాటింది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులంతా ఇప్పుడు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలంతా నామినేటెడ్ పదవుల కోసం మొదటి రోజు నుంచి ఎదురు చూశారు. వీరిలో చాలా వరకు అవకాశం లభించింది. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి, సామాజిక సమీకరణలు లెక్కలు వేసుకుని నామినేటెడ్ పదవులను చంద్రబాబు భర్తీ చేశారు. ఇప్పటికీ ఇంకా 90 కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. వీటి జాబితా కూడా ఈ నెలలోనే వస్తుందనేది సీఎంఓ వర్గాల మాట. ఇదే సమయంలో పార్టీ పదవులపై చర్చ జోరుగా జరుగుతోంది.
Also Read : భారతీయ విద్యార్ధులకు ట్రంప్ గుడ్ న్యూస్..!
2019-2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు నానాపాట్లు పడ్డారు. కొంత మంది ఊర్లు వదిలి పారిపోయారు కూడా. కేవలం టీడీపీ పదవులు నిర్వహించిన కారణంగానే అలాంటి వారిపై వైసీపీ సర్కార్ కక్ష కట్టింది అనేది బహిరంగ రహస్యం. చాలా మందిపైన అక్రమ కేసులు పెట్టింది నాటి వైసీపీ ప్రభుత్వం. దీంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు, నేతలు.. ఎన్నికల సమయంలో రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. వైసీపీ నేతల దాడులను తట్టుకుని టీడీపీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని లోకేష్ స్వయంగా ప్రకటించారు.
లోకేష్ ప్రకటనతో తెలుగు తమ్ముళ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు వస్తాయని కొందరు.. పార్టీ పదవులు వస్తాయని కొందరు ఆశపడ్డారు. నామినేటెడ్ పదవులను కీలక నేతలతో ఇప్పటికే భర్తీ చేశారు. ఇక పార్టీ పదవులపై ఇప్పటికీ ప్రకటన వెలువడలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడును తొలగించి.. ఆ స్థానంలో పల్లా శ్రీనివాసులుకు బాధ్యతలు అప్పగించారు. ఇక గతేడాది డిసెంబర్ నెలలో మాత్రం పల్లాను మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ అలాగే ఉంది.
Also Read : చంద్రబాబు ధైర్యానికి ఫిదా.. బీసెంట్ రోడ్ పర్యటనపై ప్రసంశలు..!
పల్లాను మంత్రిని చేస్తే.. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికీ అనే చర్చ నడుస్తోంది. అలాగే పార్టీకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, డ్వాక్రా సాధికార, రైతు విభాగం వంటి పదవుల్లో మెజారిటీ నేతలు ఇతర పదవుల్లో ఉన్నారు. బీసీ నేతగా ఉన్న కొల్లు రవీంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా హోమ్ మంత్రిగా బిజీగా ఉన్నారు. ఎస్సీ విభాగం అధ్యక్షులు ఎంఎస్ రాజుకు టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కింది. దీంతో వీరి స్థానంలో కొత్త వారికి ఆ పదవులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అదే సమయంలో జిల్లాల అధ్యక్ష పదవులను కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాల నుంచి నేతల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించినట్లు సమచారం. నవంబర్ నెలాఖరు నాటికి పార్టీ పదవులను భర్తీ చేస్తారనే మాట వినిపిస్తోంది.