రైలు ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రయాణ సమయం తగ్గించేందుకు అన్ని మార్గాల్లో డబుల్ ట్రాక్తో పాటు ట్రాక్ సామర్థ్యం కూడా పెంచారు. ప్రతి మార్గంలో ఇప్పుడు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేసేలా రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసింది. అలాగే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు ఇప్పటిదే సెమీ హై స్పీడ్ రైల్ వందే భారత్ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Also Read : గంభీర్ కి చెక్ పెడుతున్న బోర్డ్..? షాకింగ్ నిర్ణయం..!
ఇప్పటికే మొత్తం 150 వందే భారత్ సర్వీసులు భారత్లో పరుగులు పెడుతున్నాయి. వీటిల్లో 75 అప్ సర్వీసులుగా, 75 డౌన్ సర్వీసులుగా నడుస్తున్నాయి. అయితే వందే భారత్ రైళ్లు పూర్తిగా సీటింగ్ కావటంతో పగలు మాత్రమే ప్రయాణం చేస్తున్నాయి. వీటిల్లో దాదాపు 6 నుంచి 9 గంటల వరకు కూడా ప్రయాణీకులు అలాగే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో చాలా మంది దూర ప్రయాణాలకు ఈ రైళ్లు సరిగ్గా లేవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలును రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. అలాగే వందే భారత్ స్లీపర్ రైలులోని సదుపాయాలు అద్భుతం అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ పలు ఫోటోలను కూడా విడుదల చేశారు. దీంతో వందే భారత్ స్లీపర్ ఎప్పుడు వస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి గతేడాది దసరా నుంచే స్లీపర్ రైలు పట్టాలెక్కుతుందని అంతా భావించారు. కానీ దసరా, దీపావళి, సంక్రాంతి.. అంటూ వాయిదా పడుతూనే ఉంది తప్ప.. రైల్వే శాఖ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : మాకు ఈ పదవులు వద్దు సార్..!
తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్ల గురించి ఓ కీలక ప్రకటన బయటకు వచ్చింది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది దీపావళి నుంచి పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ – పాట్నా మధ్య ప్రారంభించనున్నట్లు ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అధికారికంగా ప్రకటించింది. అయితే రైలు టైమింగ్స్ మాత్రం ప్రకటించలేదు. దీంతో బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభిస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు.
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ కేటాయిస్తే.. ఆదాయం, ఆదరణ కూడా బాగా వస్తుందంటున్నారు. విజయవాడ – బెంగళూరు, నరసాపురం – యశ్వంతపూర్, విశాఖ – బెంగళూరు, విశాఖ – హైదరాబాద్, విశాఖ – ముంబై, విశాఖ – తిరుపతి, కాకినాడ – ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు నడిపించాలనే ప్రయాణీకులు కోరుతున్నారు.