గల్ఫ్ రీజియన్ లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్కు మరికొంత సమయం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ఇరాన్ ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని గతంలో హెచ్చరించిన అమెరికా, ఇప్పుడు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది.
Also Read : తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు..!
మరో 10 రోజుల పాటు ఇరాన్ ఇంధన క్షేత్రాలపై ఎటువంటి దాడులు చేయబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ గడువులోగా జలసంధిని పునరుద్ధరించాలని ఇరాన్ కు సూచించారు. ఇరాన్ పాలకులతో జరుగుతున్న చర్చలపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. ఇరాన్తో చర్చలు చాలా ఆశాజనకంగా సాగుతున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మెరుగయ్యాయని ఆయన వెల్లడించారు. దీనితో దౌత్యపరమైన మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : అమరావతి చట్టబద్దత.. వైసీపీ సవాల్.. ధైర్యం ఉందా..?
ఇదే సమయంలో కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థల తీరుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్-అమెరికా చర్చలపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను వదిలేసి, ఉద్రిక్తతలను పెంచేలా కథనాలు రాస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. ప్రపంచ చమురు సరఫరాలో హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో.. ఇది మూతపడితే చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ 10 రోజుల గడువు ఇవ్వడం, చర్చలు బాగున్నాయని చెప్పడంతో గ్లోబల్ మార్కెట్ లో ముడిచమురు ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది.

