ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. మరో నెల రోజుల్లో దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. జాతీయ మీడియా సైతం ఏపీ రాజకీయాల పైనే చర్చిస్తోంది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంశం కాగా.. మరో అంశం.. త్వరలోనే ఏపీలో ముఖ్యమంత్రి స్థానంలో మార్పులు చేర్పులు ఉంటాయనే పుకార్లు. ఈ రెండు అంశాలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి.
Also Read : చంద్రబాబు ఖాతాలో మరో రికార్డ్.. ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబుకే..!
కల్తీ నెయ్యి అంశంపై ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై ఏర్పాటైన సిట్ బృందం.. ఇప్పటికే కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక ఇదే విషయంపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఏకసభ్య కమిషన్ను కూడా ఏపీ సర్కార్ నియమించింది. దీంతో అసలు ఈ అంశానికి ముగింపు ఎప్పుడు వస్తుందా అనే చర్చ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. అసలు కల్తీ నెయ్యి వినియోగం అంశాన్ని ప్రజలు సైతం పెద్దగా పట్టించుకోవటం లేదు. దీంతో ఈ అంశం దాదాపు మరుగున పడినట్లు అయ్యింది. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి స్థానంలో మార్పులు అంటూ జరుగుతున్న చర్చ పెద్ద దుమారం రేపుతోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ త్వరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందుకు బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ యాదవ్ రాజీనామాను ప్రస్తావిస్తున్నారు. నితీష్ రాజ్యసభకు ఎంపికైన కారణంగా సీఎం పదవికి రాజీనామా చేశారు. నితీష్కు కేంద్ర మంత్రి పదవి ఖాయమని.. అందుకే సీఎం పదవికి రాజీనామా చేశారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇదే సమయంలో ఏపీ రాజకీయాల గురించి చర్చ నడుస్తోంది.
Also Read : ఆ సినిమాలకు అవార్డుల పంట..!
త్వరలో చంద్రబాబు తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని.. ఆయనకు ఉప ప్రధాని పదవి ఖాయమైందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమైందని.. ఈ విషయంపై ఇటీవల ఇరువురు నేతలు చర్చించుకున్నారనేది పెద్ద పుకారు. అదే సమయంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ను సీఎం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని.. లోకేష్ కూడా విషయంపై ఒత్తిడి చేస్తున్నారని వైసీపీ అనుకూల మీడియా తెగ వార్తలు ప్రసారం చేస్తుంది.
అయితే ఈ అంశంపై కేంద్ర పెద్దలు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మోదీ క్యాబినెట్లో ఉప ప్రధాని పదవే లేదని.. అసలు అలాంటి ప్రస్తావనే లేదంటున్నారు ఢిల్లీ పెద్దలు. నితీష్ కోరిక మేరకే రాజ్యసభ అవకాశం వచ్చిందని.. అంతే తప్ప చంద్రబాబు, పవన్ కేంద్ర మంత్రివర్గంలోకి వస్తామనే మాట ఇప్పటి వరకు అనలేదన్నారు. దీంతో కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లు అయ్యింది. అయితే ఇదే విషయంపై ఏపీలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ సీఎం అంటూ ఆ పార్టీ నేతలు తెగ హంగామా చేశారు. ఒక దశలో ఫ్లెక్సీలు కూడా ముద్రించారు. అయితే ఎలాంటి మార్పు లేదని.. అసలు అలాంటి పుకార్లు పుట్టిస్తే.. తాట తీస్తా అంటూ అప్పట్లో కేసీఆర్ తన పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇప్పుడు అలాంటి పని టీడీపీ నేతలు ఎందుకు చేయటం లేదనే అనుమానం వినిపిస్తోంది. ఈ పుకార్లకు బ్రేక్ వేయాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపైనే ఉందనేది టీడీపీ సీనియర్ నేతల మాట.

