రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడంతో పాటు, విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఉన్నత విద్యాశాఖ సరికొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇకపై కోచింగ్ సెంటర్లు తమ ఇష్టానుసారంగా గంటల తరబడి తరగతులు నిర్వహించడం కుదరదని, ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలనను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. నూతన నిబంధనల ప్రకారం, కోచింగ్ సెంటర్లు రోజుకు గరిష్టంగా ఐదు గంటలు మాత్రమే పనిచేయాలి.
Also Read : ఇరాన్ కు ట్రంప్ భారీ ఊరట.. డెడ్ లైన్ పెంచిన అమెరికా..!
ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు నడిచే సమయాల్లో కోచింగ్ సెంటర్లు నిర్వహించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. విద్యార్థులకు మానసిక విశ్రాంతిని కల్పించే ఉద్దేశంతో ఆదివారాలు, పండుగ సెలవు దినాల్లో కోచింగ్ తరగతులు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించింది. నిబంధనలను అతిక్రమిస్తే మొదటిసారి 50 వేల రూపాయలు, రెండోసారి లక్ష రూపాయల వరకు భారీ జరిమానాలు విధించనున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో ఎస్పీ, డీఈవోలతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
Also Read : ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణాలో భారీ ఆస్తులు..!
ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం మరో కీలక నిబంధనను చేర్చింది. ఏదైనా కారణంతో విద్యార్థి కోర్సు మధ్యలో మానేస్తే, మిగిలిన రోజులకు సంబంధించిన ఫీజును యాజమాన్యాలు కచ్చితంగా తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా, విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కోచింగ్ సెంటర్లు తమ వద్ద పెట్టుకోకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సర్టిఫికెట్ల పేరుతో విద్యార్థులను వేధించే ధోరణికి చెక్ పడనుంది. ప్రభుత్వ ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

