ఏపీలో మహిళల సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబ స్థిరత్వం, పిల్లల విద్యాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు కీలక పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఈ పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఇందులో రెండు పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టగా, మరో పథకాన్ని నేరుగా అమలు చేయనుంది. ప్రస్తుతం ఈ పథకాల అమలుకు సంబంధించి యంత్రాంగం విస్తృతంగా కసరత్తు చేస్తోంది.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం
డ్వాక్రా సంఘాల్లో కనీసం ఆరు నెలలు సభ్యత్వం ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు. వారి పిల్లల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఇంట్లో గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం రూ.10,000 నుండి రూ.1,00,000 వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంపై పావలా వడ్డీ మాత్రమే విధించబడుతుంది. రుణాన్ని 48 నెలలలో సులభ వాయిదాల్లో చెల్లించే సౌకర్యం కల్పించారు.
Also Read : గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి మంత్రి కొండపల్లి భరోసా
దరఖాస్తుకు ఆధార్ కార్డు, ఆదాయ లేదా డొమిసైల్ సర్టిఫికేట్, పాఠశాల/కాలేజీ అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు రసీదులు అవసరం. బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి. దరఖాస్తు ఆమోదం పొందిన 48 గంటలలోపు స్త్రీనిధి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేయబడుతుంది.
ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకం
పేద కుటుంబాల్లో కూతుళ్ల వివాహ ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. డ్వాక్రా సంఘంలో కనీసం ఆరు నెలల సభ్యత్వం ఉన్న మహిళలు అర్హులు. వివాహ ఖర్చుల కోసం రూ.10,000 నుండి రూ.1,00,000 వరకు రుణం పొందవచ్చు. ఈ రుణానికి కూడా పావలా వడ్డీ మాత్రమే ఉంటుంది. 48 నెలలలో వాయిదాలుగా చెల్లించవచ్చు.
Also Read : ఖమేనీ అంతం.. మిడిల్ ఈస్ట్లో మంటలు.. ఇరాన్ ప్రతీకారం హెచ్చరిక
దరఖాస్తుకు ఆధార్ కార్డు, వివాహ ఆహ్వాన పత్రిక లేదా వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. అర్హత నిర్ధారణ పూర్తయిన తర్వాత 48 గంటలలోపు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతుంది. అయితే లబ్ధిదారు అకాల మరణం చెందిన సందర్భంలో రుణం రద్దు చేసే అవకాశం ఉంటుంది.
డ్వాక్రా సంఘాల బలోపేతం
డ్వాక్రా సంఘాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమ్యూనిటీ కోఆర్డినేటర్లు మరియు యానిమేటర్లకు రూ.15,000 విలువ చేసే స్మార్ట్ఫోన్లు అందించనుంది. అదనంగా సుమారు 600 మంది ఏపీఎంలకు ల్యాప్టాప్లు పంపిణీ చేయనుంది. గతంలో ఇచ్చిన పరికరాలు పనిచేయకపోవడంతో కొత్త పరికరాలు అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.
మొత్తంగా మహిళల ఆర్థికాభివృద్ధి, విద్య, వివాహ సహాయం మరియు సంఘాల బలోపేతం లక్ష్యంగా ఈ మూడు పథకాలను మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభించనుంది ఏపీ కూటమి ప్రభుత్వం.

