మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయమైంది. క్వార్జ్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో రక్షణ కల్పించేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. అలాగే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కాకాణి గోవర్థన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే కేసు కట్టి వేయాలంటూ కాకాణి గోవర్థన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ మాత్రం హైకోర్టు వాయిదా వేసింది.
Also Read : 2019 వ్యూహమే జగన్ ప్లాన్ చేసారా..? చింతమనేని అలెర్ట్ గా ఉండాల్సిందే
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా వ్యవహరించిన కాకాణి గోవర్థన్ రెడ్డి దాదాపు పది రోజులుగా పరారీలో ఉన్నారు. ఫిబ్రవరి 16న కాకాణిపై కేసు నమోదైంది. అక్రమ మైనింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించినట్లు కాకాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తొలి రోజుల్లో తాను ఎలాంటి తప్పు చేయలేదన్న కాకాణి గోవర్థన్ రెడ్డి.. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తా అంటూ గొప్పగా ప్రకటించారు. కానీ ఆ తెల్లారి నుంచే తప్పించుకు తిరుగుతున్నారు. పోలీసులు ఇప్పటికే కాకాణికి మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. పోలీసులు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకున్న కాకాణి.. ఇంట్లో ఉండకుండా పారిపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఇక మూడోసారి కాకాణి బంధువులకే నోటీసులిచ్చారు.
Also Read : చంద్రయ్య, సుబ్బయ్య మనుషులు కాదా జగన్..?
కాకాణి కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో గాలిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఉన్న తన నివాసంలో ఓ ఫంక్షన్లో కాకాణి పాల్గొన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆఘమేఘాల మీద హైదరాబాద్ చేరుకున్నారు. ఇంటికి వెళ్లేలోపు విషయం తెలుసుకున్న కాకాణి.. సైలెంట్గా చెక్కేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఏప్రిల్ 3న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట కాకాణి విచారణకు హాజరవ్వాల్సి ఉంది. కానీ మూడు సార్లు కూడా విచారణకు రాకుండా కాకాణి డుమ్మా కొట్టారు. అదే సమయంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనినే హైకోర్టు కొట్టివేసింది. దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా ఎంపీ మిథున్ రెడ్డి మాదిరిగా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారనే టాక్ వినిపిస్తోంది.




