గత మూడు నాలుగు నెలలుగా ఉత్కంట రేపుతోన్న భారతీ సిమెంట్స్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీకి చెందిన.. భారతి సిమెంట్స్, అలాగే రామ్ కో సిమెంట్స్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా పొందిన సున్నపురాయి గనుల లీజులపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. గత కొన్నాళ్లుగా గనుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలోని కమిటీ ఈ లీజులపై విచారణ జరుపుతోంది. ఈ కమిటీ సమర్పించిన నివేదికలో విస్తుపోయే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది.
Also Read : తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు..!
పారదర్శకత లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి ఈ లీజులను కట్టబెట్టారని కమిటీ నిర్ధారించింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్న ఈ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని కంపెనీలను ఆదేశించింది. ఈ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం భారతి, రామ్ కో సిమెంట్స్ ప్రతినిధులకు అవకాశం కల్పించింది. వచ్చే నెల ఏప్రిల్ 6న కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనను వినిపించాలని స్పష్టం చేసింది.
Also Read : బస్సు ప్రమాదం.. వైద్య ఆరోగ్య శాఖపై విమర్శలు..!
ఒకవేళ కంపెనీలు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, వెంటనే ఆ లీజులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ కు నోటీసులు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. గత ఐదేళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి గనులను దోచుకున్నారని కూటమి నేతలు చేసిన ఆరోపణలకు ఈ నోటీసులు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సిమెంట్ పరిశ్రమలో ప్రకంపనలు మొదలయ్యాయి. లీజుల రద్దు జరిగితే ఆయా కంపెనీల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 6న జరిగే విచారణలో కంపెనీలు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

