తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సభ లోపల సంచలనాలకు దారితీస్తుంటే, సభ వెలుపల మాత్రం ప్రతిపక్ష నేత కేసీఆర్ టార్గెట్గా ఊహించని పొలిటికల్ డ్రామా నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు దాటుతున్నా, గులాబీ బాస్ ఒక్కసారి కూడా అసెంబ్లీ మొహం చూడకపోవడాన్ని అధికార పార్టీ ఇప్పుడు తీవ్రంగా అస్త్రంగా మార్చుకుంది. సభకు రాకుండానే బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లు, గన్మెన్లు, జీతభత్యాల రూపంలో ఏకంగా 22 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారంటూ ఇందిరా పార్క్ సాక్షిగా కాంగ్రెస్ ఏకంగా ‘రివర్స్ ధర్నా’కు దిగడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read : బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి..? దాని రకాలు, ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఒక సామాన్య ఉద్యోగి ఆఫీస్కు రాకపోతే సస్పెండ్ చేస్తారు కదా, మరి వెయ్యి రోజులుగా సభకు రాని కేసీఆర్ను ఏం చేయాలంటూ రేవంత్ రెడ్డి వేస్తున్న వెటకారపు ప్రశ్నలు గులాబీ క్యాడర్కు మింగుడుపడటం లేదు. అయితే రేవంత్ రెడ్డి ఈసారి కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా, కేసీఆర్ ప్రతిపక్ష హోదాను శాశ్వతంగా రద్దు చేసేందుకు ఒక పక్కా లీగల్ స్కెచ్ వేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం.. ఒక ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ అనుమతి లేకుండా నిరంతరాయంగా 50 రోజులకు పైగా సభకు గైర్హాజరైతే, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.
ఇప్పుడు సరిగ్గా ఇదే ’50 రోజుల రూల్’ బుక్ను తిరగేస్తూ కాంగ్రెస్ లీగల్ టీమ్ రంగంలోకి దిగింది. కేసీఆర్ గైర్హాజరును సాంకేతికంగా నిరూపించి, ఆ కుర్చీని ఖాళీ చేయించడం లేదా రద్దు చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయాలనేది రేవంత్ సర్కార్ ప్లాన్గా కనిపిస్తోంది. నిజానికి ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక పెద్ద సైకలాజికల్ గేమ్. ఈ వివాదం ద్వారా కేసీఆర్ను ఎలాగైనా ఫామ్హౌస్ దాటించి అసెంబ్లీ మెట్లు ఎక్కేలా చేయడం, ఒకవేళ ఆయన వస్తే సభలోనే లైవ్ డిబేట్ పెట్టి కార్నర్ చేయాలనేది కాంగ్రెస్ వ్యూహం.
Also Read : వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి చిన్న శ్రీను..!
ఒకవేళ కేసీఆర్ రాకపోతే.. “మీ వల్ల కాకపోతే ఆ ప్రతిపక్ష నేత పదవిని మీ కొడుకు కేటీఆర్కో లేక అల్లుడు హరీష్ రావుకో ఇచ్చేయండి, అంతేకానీ కుర్చీని ఖాళీగా ఉంచి బిల్లులు వసూలు చేయకండి” అంటూ కాంగ్రెస్ శ్రేణులు మరింత వెటకారంగా ఒత్తిడి పెంచుతున్నాయి. మొత్తానికి అటు సభలో బీఆర్ఎస్ కౌంటర్లను తిప్పికొడుతూనే, ఇటు బయట కేసీఆర్ హోదాకే ఎసరు పెడుతూ రేవంత్ రెడ్డి వేసిన ఈ రివర్స్ స్కెచ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

