“విజయవాడ ఉత్సవ్ పేరుతో రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. అక్షరాలు వంద కోట్ల రూపాయలు మంచి నీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు..” ఇది వైసీపీ నేత పోతిన వెంకట మహేశ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఆ వెంటనే కొంతమంది వైసీపీ నేతలు కూడా.. టీడీపీ నేతలు వంద కోట్లు దోచుకుంటున్నారు.. అని కొత్త పాట పాడుతున్నారు. దీంతో నిజంగానే విజయవాడ ఉత్సవ్కు వంద కోట్లు ఖర్చు చేస్తున్నారా.. ఉత్సవ్ పేరుతో వంద కోట్లు దోచుకుంటున్నారా.. అనే మాట బాగా వినిపిస్తోంది.
Also Read : టూరిస్ట్ వీసాలు కూడా కష్టమేనా..? మూడు నిమిషాల్లో వీసా రిజెక్ట్..!
విజయవాడకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ను ఘనంగా నిర్వహిస్తున్నారు. 11 రోజుల పాటు విజయవాడలోని పున్నమి ఘాట్, తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 54 రోజుల పాటు విజయవాడ ఎక్స్ పో పేరుతో ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ సంబరానికి ప్రభుత్వం కేవలం సహకారం మాత్రమే అందిస్తోంది. ఎలాంటి ఆర్థిక సహకారం ఏపీ ప్రభుత్వం ఇవ్వటం లేదు.
విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వాహకులు పూర్తిగా సొంత నిధులతో నిర్వహిస్తున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి కొద్ది పాటి రాయితీలు మాత్రమే వస్తున్నాయి. 11 రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల వేదికలను మాత్రమే ప్రభుత్వం అందిస్తోంది. కానీ వాటి నిర్వహణ మాత్రం 11 రోజులు ఉత్సవ కమిటీదే బాధ్యత. విద్యుత్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ఇక గొల్లపూడి గ్రౌండ్స్ను అద్దె ప్రాతిపదికనే ప్రభుత్వం కేటాయించింది. దీని ద్వారా ప్రభుత్వానికి 40 లక్షల రూపాయలు చెల్లించనున్నారు.
విజయవాడ ఉత్సవ్లో పాల్గొనేవాళ్లు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంది. అలాగే స్టాల్ పెట్టే వారి నుంచి కూడా ముందుగానే రుసుం వసూలు చేస్తున్నారు. పున్నమిఘాట్, తుమ్మలపల్లి, ఘంటసాల వేదికలకు ఎలాంటి ప్రవేశ రుసుం లేదు అని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం అని కూడా చెబుతున్నారు. విజయవాడ బ్రాండ్ పెరుగుతుంది కాబట్టే.. ప్రభుత్వం సహకరిస్తోందనేది నిర్వాహకుల మాట.
Also Read : మర్రి రాకతో గుబులు మొదలైందా..?
కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ ఈవెంట్ పై తొలి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. గొల్లపూడి గ్రౌండ్స్ ఇవ్వడంపై కోర్టులో కేసు వేసి స్టే తెచ్చారు. అయితే హైకోర్టు మాత్రం ప్రభుత్వానికి డబ్బులు వస్తుంటే.. మీకేంటి నొప్పి అని ఘాటు వ్యాఖ్యలు చేసి ఎక్స్ పో నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. ఇక వ్యాపారులు కూడా తమకు రూపాయి వస్తుందని నమ్ముతూ స్టాల్స్ తీసుకుంటున్నారు. స్టాల్స్ కేటాయింపులో ముందు వచ్చిన వారికి ముందు.. అనే విధానం అమలు చేస్తున్నారు. దీంతో స్టాల్స్ కేటాయింపు ద్వారా నిర్వాహకులకు ఆదాయం వస్తోంది.
కానీ వైసీపీ నేతలు మాత్రం విజయవాడ ఉత్సవ్ పేరుతో ఏకంగా వంద కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని.. వంద కోట్లు దోచేస్తున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై నిర్వాహకులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. విజయవాడకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుంటే.. వైసీపీ నేతలు చూసి తట్టుకోలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.