వైసీపీ నేతల తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ – షర్మిల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. హర్ ఘర్ కీ కహానీ అని జగన్ ఓ మాట అనేసి బెంగళూరు వెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత నుంచి ఈ వివాదం ముదిరి పాకాన పడింది. వాస్తవానికి ఈ వివాదం జగన్ వల్లే మొదలైంది అనేది బహిరంగ రహస్యం. ఆస్తి కోసం షర్మిల పైన, విజయలక్ష్మి పైన కేసు వేయడంతో పాటు షర్మిలకు లేఖ కూడా రాశాడు. దీనికి కౌంటర్గా షర్మిల లేఖ రావడంతో… ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. దీనికి జగన్ కూడా నిజమే ఒప్పుకోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
ఇక ఈ వివాదంలోకి వైసీపీ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టడంతో మరింత ముదిరిపోయింది. ముందుగా జగన్, షర్మిల సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లు పెట్టడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. అయితే జగన్ను కాపాడేందుకు, తప్పంతా షర్మిలదే అని చెప్పేందుకు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యాయి. అవి ఇప్పుడు జగన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. కష్టపడి సంపాదించాడని… జగన్ అసలు మోసం చేయడంటూ వైవీ, సాయిరెడ్డి గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే జగన్ కష్టం వెనుక వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి పదవి లేదా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
Also Read : అక్కడికి వచ్చే ధైర్యం జగన్ కి ఉందా?
ఇక 2004 ముందు జగన్ ఆస్తి ఎంత… వైఎస్ సీఎం అయిన తర్వాత జగన్ ఆస్తి ఎంత అంటూ అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ ఆస్తులపై అసెంబ్లీ వేదికగా చర్చించాలని కూడా కొందరు పట్టుబడుతున్నారు. ఇక వైవీ, సాయిరెడ్డి మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. గతంలో వైఎస్ఆర్కు వీరిద్దరు వీరాభిమానులు. కుటుంబంపై ఈగ కూడా వాలనివ్వలేదు. ప్రతి విషయంలో కూడా వీరిద్దరి పాత్ర చాలా కీలకం. ఇలాగే వైఎస్ షర్మిల పాదయాత్ర సమయంలో ఆమెకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. రాజకీయంగా ఎన్నో సూచనలు చేశారు.
పాదయాత్ర ఆసాంతం అండగా నిలిచారు కూడా. అలాంటి ఇద్దరు ఇప్పుడు అదే షర్మిలను తప్పుబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే జగన్కు ఆస్తి దక్కేందుకు షర్మిలను కించపరిచేలా కూడా మాట్లాడుతున్నారు. దీంతో నాడు చూపించిన విశ్వాసం ఇప్పుడు ఏమైంది అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. పైగా ఇదే విషయాన్ని విజయలక్ష్మి కూడా తన లేఖలో ప్రస్తావించారు. వైఎస్ కుటుంబం నుంచి మీకు మొత్తం తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటూ లేఖలో వైఎస్ విజయలక్ష్మి రాయడంతో ఆ రోజు ఓ మాట… ఈ రోజు ఓ మాట… మాట్లాడుతున్నారు మీరు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.