ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్.. పార్టీ బలోపెతంపై ఫోకస్ పెట్టారా..? పార్టీ నాయకత్వాన్ని పరుగులు పెట్టించేందుకు జగన్ సిద్దమయ్యారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి అతిధి మాదిరి వచ్చి వెళ్ళే జగన్ ఇప్పుడు కీలక అడుగులు వేస్తున్నారు. వరుస సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలని కంకణం కట్టుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ఆశించిన స్థాయిలో ప్రజా పోరాటాలు చేయలేదు. ప్రజల్లోకి పెద్దగా వెళ్ళే ప్రయత్నం చేయలేదు.
Also Read : జూబ్లీహిల్స్ అభ్యర్థి ఆయనే..? ఫైనల్ చేసిన కాంగ్రెస్
జగన్ ఎక్కువగా బెంగళూరుకే పరిమితం అయిన పరిస్థితి. ఇక ప్రతిపక్ష హోదా లేదు అనే కారణంతో అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ వెళ్ళలేదు. ఈ సమయంలో నాయకత్వం కూడా బయటకు రావడానికి సాహసం చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం ఫోకస్ చేయడంతో నాయకులు దూకుడు ప్రదర్శించడం లేదనే చెప్పాలి. అగ్ర నాయకత్వం కూడా మీడియా సమావేశాలు సైతం నిర్వహించేందుకు ముందుకు రావడం లేదు. ఇక కార్యకర్తల్లో కూడా భయం ఎక్కువగా ఉంది.
సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ పై చర్యలు ఉండటంతో పెద్దగా ముందుకు వచ్చే సాహసం చేయడం లేదు. దీనికి తోడు లిక్కర్ స్కాం వ్యవహారం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారంలో పార్టీ కీలక నాయకులు అరెస్ట్ కావడంతో కార్యకర్తల్లో ఓ రకమైన ఆందోళన నెలకొంది. ఇది కూడా కార్యకర్తలు బయటకు రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. దీనితో వారిలో ధైర్యం నింపేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
Also Read : కూటమి.. నిజంగానే ఇది మంచి ప్రభుత్వం..!
ఈ సమావేశంలో పార్టీ నేతలకు కీలక సూచనలు చేయనున్నారు. ఇక నుంచి ప్రజా పోరాటాలు చేయాలని పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ముందుకు వెళ్ళే దిశగా అడుగులు వేయనున్నారు జగన్. ఇటీవల ఓ సమావేశం నిర్వహించిన జగన్.. మంగళవారం మరో సమావేశానికి సిద్దమయ్యారు. ఇది ఖచ్చితంగా సంచలనంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.