ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. వాలంటీర్ల వ్యవస్థను తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా మనం చూసాం. వాళ్లను ఉద్యోగులుగా ముందు చెప్పి ఆ తర్వాత సేవ అంటూ జగన్ సర్కార్ మాట మార్చింది. ఇక వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇక ప్రభుత్వంపై వారిలో కూడా ఒకానొక దశలో తిరుగుబాటు మొదలయింది. వాలంటీర్లు మోసం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
అయితే ఇప్పుడు ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్ట్ లోనే వాలంటీర్ వ్యవస్థ రద్దు అయినట్టుగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ మీద సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సమయంలో ఒక విషయం బయటకు వచ్చింది. వాలంటీర్ల ప్రక్షాళనలో వెలుగులోకి విస్తుగోలిపే వాస్తవాలు వచ్చాయి. గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను కూడా నిర్లక్ష్యం చేసినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది.
గత ఏడాది ఆగస్టులోనే రద్దైన వలంటీర్ల వ్యవస్థను అక్రమంగా కొనసాగించారని సర్కార్ గుర్తించింది. అధికారంలో ఉన్నప్పుడే వలంటీర్ల వ్యవస్థకు కాలపరిమితి ముగిసినా సరే అప్పటి ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. వారిని కొనసాగించే అంశానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు జగన్. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు అక్రమంగానే పని చేసినట్టు విచారణలో వెల్లడి అయింది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. వారి గౌరవ వేతనం కోసం ఏటా రూ.1,848 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.