దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు.. బెంగుళూరులో చర్చలు.. చెన్నైలో ఫైనల్ డీల్.. ఇండియా కూటమి వైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే అధినేత విజయ్ అడుగులు.. ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హాట్ టాపిక్. 2026 తమిళనాడు ఎన్నికల వేళ దక్షిణాది రాజకీయ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు చెందిన అగ్ర నేతలు ఇప్పుడు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కొంతకాలంగా సాగిస్తున్న రాయబారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. బెంగుళూరు వేదికగా మొదలైన మంతనాలు ఇప్పుడు చెన్నైలో ‘ఫైనల్ డీల్’ దిశగా సాగుతున్నాయి. ఒకవైపు జగన్ను, మరోవైపు తమిళనాడులో క్రేజీ స్టార్గా మారిన విజయ్ను I.N.D.I.A. ఇండియా కూటమిలోకి తీసుకురావడంలో డీకే కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల గుర్రుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : సిగ్గు సిగ్గు.. జగన్ పరామర్శకు ఇవేనా అర్హతలు..?
తిరుమల లడ్డూ అంశంలో బీజేపీ కూడా తనపై దేశవ్యాప్తంగా విమర్శలు చేయడం, విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీకి దూరంగా ఉండాలని జగన్ నిశ్చయించుకున్నారనే మాట బాగా వినిపిస్తోంది. నిజానికి తొలి నుంచి బీజేపీ పెద్దలతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారనేది జగన్పై ఉన్న ప్రధాన ఆరోపణ. అందుకే కేంద్రంలో మోదీ సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతున్నా కూడా.. జగన్ కేసులు అంగుళం కూడా ముందుకు సాగటం లేదని గుర్తు చేస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్కు బీజేపీ నేతలు అండగానే ఉన్నారు. దీంతో బీజేపీ – వైసీపీ మధ్య బలమైన బంధం ఉందనేది తొలి నుంచి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
అయితే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కల్తీ నెయ్యి వినియోగించినట్లు టీటీడీ మాజీ ఛైర్మన్, జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో.. ఈ వ్యవహారంలో హిందూ ధార్మిక సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పెద్దగా ఫలితం రాలేదు. చివరికి కులం కుంపట్లు పెట్టేందుకు చూసినా.. ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ఇక తొలి రోజుల్లో సైలెంట్గా ఉన్న కేంద్ర పెద్దలు.. ఇప్పుడు ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ అనుకూల మీడియాతో పాటు జాతీయ మీడియా మొత్తం జగన్ సర్కార్ అవినీతిని ఎండగడుతున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోగా, తనపై జాతీయ మీడియాలో వస్తున్న నెగటివ్ కథనాల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని భావించిన జగన్.. ఇండియా కూటమిలో చేరి మోదీకి గట్టి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారనే మాట వినిపిస్తోంది.
Also Read : కుల చిచ్చు కోసం కొత్త డ్రామా..?
తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. పెరియార్, అంబేద్కర్లతో పాటు కాంగ్రెస్ దిగ్గజం కామరాజ్ సిద్ధాంతాలను కూడా విజయ్ తన పార్టీ ఎజెండాలో చేర్చుకున్నారు. ఇది కాంగ్రెస్తో పొత్తుకు మార్గం సుగమం చేసింది. డీఎంకేతో పొత్తు విషయంలో కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న తరుణంలో.. విజయ్ పార్టీ కాంగ్రెస్కు ‘పవర్ షేరింగ్’.. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే అధినేత విజయ్తో జగన్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని, వీరంతా కలిసి దక్షిణాదిలో ఒక లౌకిక కూటమిని నిర్మించబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. త్వరలోనే జగన్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి దీనిపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ తన అనుకూల మీడియా ద్వారా త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయ్ను జగన్ కలవడాన్ని వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో తెగ హోరెత్తిస్తున్నారు. వైఎస్ జార్జి రెడ్డి మనవడు, వైఎస్ సునీల్ రెడ్డి కొడుకు అయిన సాహిల్ వివాహం చెన్నైలో జరిగింది. ఈ వివాహ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత చిదంబరం, టీవీకే నేత విజయ్, సినీ నటులు మోహన్ బాబు, సూర్య, కార్తిక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆ సందర్భంగా.. పనిలో పనిగా ఈ ‘డీల్’ కూడా కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. విజయ్ రాక సందర్భంగా వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ నుండి అందరూ ఎదురుచూడటం, జగన్ స్వయంగా వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ విజయ్ని ఆహ్వానించడం లాంటి పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
Also Read : ట్రంప్ మెప్పు కోసమేనా..? రష్యా ఆయిల్ భారత్ కొనాల్సిందే..?
పొత్తు దిశగా జగన్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. ఇటీవలే పార్లమెంటులో.. “నేను గెలిచినా కూడా ఎన్నికల విధానం మీద, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి” అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా మాట్లాడించి రాహుల్ గాంధీకి జగన్ నేరుగా సంకేతాలు పంపించినట్లు అయ్యింది. ఈ వ్యూహం ఫలితంగానే ఇప్పుడు కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు వేగంగా పడుతున్నాయని అర్థం అవుతోంది. మరోవైపు విజయ్ తన పార్టీని ప్రకటించినప్పటి నుండి తమిళనాడులోని అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్నారు. అయితే, లడ్డూ కల్తీ వివాదంలో జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయనతో కలవడం వల్ల, తమిళనాడులోని హిందూ ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పుడే ఆయనతో భేటీ అవసరమా?” తెలంగాణాలో కేటీఆర్ లెక్కన తప్పు చేస్తున్నారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
తమిళనాడు బీజేపీ నేతలు ఇప్పటికే లడ్డూ వివాదాన్ని తమిళనాడులో కూడా హైలెట్ చేశారు. ఇప్పుడు జగన్తో విజయ్ జతకడితే, “హిందూ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి” అని బీజేపీ విమర్శించే అవకాశం ఉందని, అది విజయ్ కొత్త పార్టీకి నష్టం చేస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణాదిలో మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలంటే జగన్ మద్దతు అవసరం అని మరికొందరు తమిళనాడులో వాదిస్తున్నారు. ఏదీ ఏమైనా.. చెన్నై వేదికగా జరిగిన మంతనాలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.

