భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా.. అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుసగా రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. ప్రస్తుతం రాజకీయం అనే మాటే ఎత్తటం లేదు. ఇంకా చెప్పాలంటే.. రాజకీయాలంటే ఏ మాత్రం ఆసక్తి చూపించటం లేదనే మాట కూడా బాగా వినిపిస్తోంది. అటు సొంత పార్టీ నేతలు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read : పెనుమార్పులు దిశగా ఏపి రాజకీయాలు
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌజ్కే పరిమితం అయ్యారు. రెండు సంవత్సరాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అది కూడా మొక్కుబడిగా మాత్రమే హాజరయ్యారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత బాత్రూమ్లో కాలు జారి పడటంతో దాదాపు ఆరు నెలల పాటు పూర్తిగా బయటకు రాలేదు. ఆ తర్వాత తొలిసారి పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే కనీసం ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవకపోవడంతో పాటు.. కొంతమంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవటం.. బీఆర్ఎస్ అధినేతను తీవ్ర నిరాశకు గురి చేసినట్లు అయ్యింది.
నిజానికి పార్టీ సారధ్య బాధ్యతల నుంచి కేసీఆర్ ఎప్పుడో తప్పుకున్నారు. పార్టీ బాధ్యతలను కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్కు అప్పగించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తెలంగామలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై వరుస కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కేసీఆర్ను కూడా ఇప్పటికే అధికారులు విచారించారు. ఇక ఈ కేసుల్లో కేటీఆర్ అరెస్టు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. అయితే గత డిసెంబర్ నెలలో తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు తెలంగాణలో ప్రాజెక్టులపై జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతా అని కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. కానీ సభకు వచ్చిన కేసీఆర్.. పట్టుమని పది నిమిషాలు కూడా లేరు. కనీసం నోరెత్తలేదు.
Also Read : అభివృద్ధా.. ప్రతీకారమా?
అలాగే కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగుతారని.. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని గతంలో బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పారు. కానీ ఆ మాట చెప్పి ఏడాది దాటింది. ఆ తర్వాత తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశాల్లో కూడా పార్టీ నేతలు కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగుతారు.. రేవంత్ సర్కార్ను చీల్చి చెండాడుతారు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కొంతమంది అయితే మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ స్వయంగా పాల్గొంటారన్నారు. కానీ.. అవేవీ జరగలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత తరఫున కేసీఆర్ ఒక్కరోజు కూడా ప్రచారం చేయలేదు. మునిసిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రస్తావనే లేదు. కేసీఆర్ తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. సిట్ విచారణ కోసమే ఫామ్ హౌజ్ నుంచి నందినగర్ ఇంటికి వచ్చారని.. విచారణ తర్వాత మళ్లీ ఫామ్ హౌజ్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై చెప్పేశారా.. అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

