తెలంగాణాలో ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపికపై పెద్ద చర్చే జరుగుతుంది. అసలు ఎవరిని ఎంపిక చేస్తారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం తెలంగాణాలో కొందరు కాంగ్రెస్ కీలక నేతలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న యువ నేతలు కూడా రేవంత్ తర్వాత బాధ్యతలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. గత అయిదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని రేవంత్ సమర్ధవంతంగా నడిపారు. తెలంగాణా వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను తొలిసారి అధికారంలోకి తెచ్చారు ఆయన.
పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావొస్తున్న సంగతి తెలిసిందే. ఈ 8 నెలల నుంచి పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో సంస్థాగతంగా బలోపేతం పై కాంగ్రెస్ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఇక గ్రేటర్ ఎన్నికలతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండటంతో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు రేవంత్ తన వారసుడి ఎంపిక విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నారట. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతల్లో ఒకరికి ఇవ్వాలని ఆయన కసరత్తు చేస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలో ఎస్టీ నేత పేరు ఖరారు అయిందని అంటున్నారు.
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరుని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిందని రేవంత్ ప్రతిపాదన పంపిన వెంటనే దానికి ఓకే చేసారని తెలుస్తోంది. ఇక మంత్రులు కూడా దానిపై సుముఖంగా ఉన్నట్టుగా తెలంగాణా కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏ ఎన్నికలు అయినా సరే ఎదుర్కోవడానికి పార్టీని సిద్దం చేసే బాధ్యతను ఆయనకు అప్పగిస్తారని ఇక సీతక్క పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారు. సీతక్కకు రేవంత్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో కూడా కలిసి పని చేసారు. దీనితో ఆమె వైపు కూడా రేవంత్ మొగ్గు చూపుతున్నారని సమాచారం. మరి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.