రండి రోడ్డెక్కుదాం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం.. ప్రభుత్వాన్ని నిలదీద్దాం.. అంటూ క్యాడర్ను పిలుస్తున్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. బిగ్ బాస్ షోలో మాదిరిగా టాస్కులు ఇస్తున్నారు తప్ప.. అధినేత మాత్రం ఎక్కడ కనిపించటం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. క్యాడర్కు ఉత్సాహం రావాలంటే.. లీడర్ కూడా వారితో పాటు నడవాలి. ఇంకా చెప్పాలంటే.. లీడర్ ముందు నడిస్తే.. క్యాడర్ ఆ మార్గాన్ని అనుసరిస్తారు. కానీ వైసీపీలో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరు. ఇక్కడ అంతా కార్పొరేట్ స్టైల్.
ర్యాలీలు చేయండి.. ధర్నాలు చేయండి.. ముట్టడించండి.. నిలదీయండి.. ప్రశ్నించండి.. అంటూ వైసీపీ అధినేత జగన్.. తన పార్టీ క్యాడర్కు బిగ్ బాస్ టాస్కులు ఇస్తారు. రండి రోడెక్కుదాం.. అంటూ సోషల్ మీడియాలో ఓ చాట భారతం అంత స్క్రిప్ట్ పెడతారు. ఇది చూసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా అభిమానులు కూడా మా అన్న కోసం అంటూ పోలోమని రోడెక్కుతారు. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత పోలీసులు తమ పని తాము చేసేస్తున్నారు. అరెస్టులు, జైలు, బెయిలు.. ఇది వైసీపీ నేతలు, క్యాడర్ పరిస్థితి.
Also Read : పెద్దిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్..? మదనపల్లి ఫైల్స్ లో కీలక పరిణామం
మరి అధినేత ఎక్కడా అని చూస్తే మాత్రం.. ఆయన కేరాఫ్ అడ్రస్ బెంగళూరు ఎలహంక ప్యాలెస్. అక్కడ ఆయన హాయిగా రెస్టు తీసుకుంటున్నారు. ఇక్కడ క్యాడర్ మాత్రం పోలీసుల చేతుల్లో దెబ్బలు తింటున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. రండి ముట్టడిద్దాం అని చెప్పింది కూడా జగన్. కానీ చివరి నిమిషంలో జగన్ ఎక్కడున్నారు అని క్యాడర్ అంతా వెతుకుతున్న పరిస్థితి.
వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్మించింది.. కావాలంటే చూడండి అంటూ ప్రెస్ మీట్లో ఫోటోలు చూపించారు జగన్. అయితే వెంటనే టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ మొండిగోడల మధ్యలో కాలేజీలు ఎలా పెట్టాలంటూ కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అంతా ఆ కాలేజీల దగ్గరకు వెళ్లి జగన్ను ప్రశ్నించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన జగన్.. ఈ నెల 19న చలో మెడికల్ కాలేజీలు అంటూ పిలుపునిచ్చారు. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండటంతో.. 17వ తేదీ సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్నారు. దీంతో “అన్న అసెంబ్లీకి వసున్నాడు.. కాసుకోండి రా..” అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టారు.
Also Read : సిట్ తర్వాత ఈడీ..? మిథున్ రెడ్డి కేంద్రగా కీలక దర్యాప్తు..!
జగన్ మాత్రం అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా శాసనమండలి సభ్యులతో కాసేపు ముచ్చటించిన తర్వాత సైలెంట్గా బెంగళూరు వెళ్లిపోయారు. పట్టుమని 24 గంటలు కూడా తాడేపల్లి ప్యాలెస్లో జగన్ లేకుండా పోవడంతో ఇప్పుడు క్యాడర్ అంతా షాక్ అయ్యింది. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ దగ్గరకు వెళ్తారని అంతా ముందు భావించారు. ఇందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ముందు రోజు సాయంత్రమే జగన్ బెంగళూరు వెళ్లిపోయారు. కానీ ఈ విషయం తెలియక విజయవాడ సహా చుట్టు పక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మచిలీపట్నం చేరుకున్నారు. అధినేత రావడం లేదని తెలిసి నిరుత్సాహానికి గురయ్యారు.
అన్న పిలుపిస్తున్నారు తప్ప.. ఎక్కడా కనిపించటం లేదనే మాట వైసీపీ కార్యకర్తలు, నేతల్లో బాగా వినిపిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తానని.. క్యాడర్తో ప్రత్యేకంగా సమావేశమవుతానని పదే పదే చెప్పారు. సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, వినాయకచవితి, దసరా కూడా వచ్చింది.. కానీ జగన్ మాత్రం ప్యాలెస్ దాటి కాలు బయట పెట్టలేదు. దీంతో పదవులు లీడర్కు.. దెబ్బలు క్యాడర్కు.. అని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.