గత కొంతకాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఒక కీలక మలుపు తిరగబోతోందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇరు దేశాల మధ్య 45 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించే దిశగా అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్, క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తుంటే ఈ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Also Read : యుద్ధం.. అప్రకటిత లాక్ డౌన్..!
యుద్ధ తీవ్రతను తగ్గించి, మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ 45 రోజుల విరామం ఉపయోగపడుతుందని మధ్యవర్తులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఇరు పక్షాలు దాడులు ఆపి, శాంతి చర్చలకు సిద్ధమవ్వాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ముఖ్యంగా చమురు ధరలు పెరగకుండా ఉండాలంటే హోర్ముజ్ జలసంధిలో రాకపోకలు సాఫీగా సాగడం ప్రపంచ దేశాలకు అవసరం. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. హోర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు తప్పవని ఆయన గడువు విధించారు.
Also Read : ఏపీలో మరో రేపిస్ట్ సంగతేంటి..? సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..?
ఈ 48 గంటల సమయం ముగియ వస్తుండటంతో, అంతలోనే పాక్షిక ఒప్పందం కుదురుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతానికి ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇరాన్ తన పట్టు వదలడం లేదు, ఇటు ఇజ్రాయెల్ తన దాడులను ఆపడానికి సిద్ధంగా లేదు. అలాగే.. ట్రంప్ హెచ్చరించినట్లుగా ఇరాన్ చమురు నిక్షేపాలు లేదా అణు కేంద్రాలపై దాడులు జరిగితే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా రాబోయే 48 గంటలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఒకవేళ చర్చలు సఫలమై 45 రోజుల కాల్పుల విరమణ అమల్లోకి వస్తే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది. లేదంటే, ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం మరో భయంకరమైన దశకు చేరుకోవడం ఖాయంగా భావిస్తున్నారు.

