పసుపు పండుగకు తెలుగు తమ్ముళ్లు సిద్ధం అవుతున్నారు. కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. 3 రోజుల పాటు మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కడప నగరం మొత్తం పసుపు మయం చేసేశారు. కడప సమీపంలోని చెర్లోపల్లి గ్రామం వద్ద మహానాడు కోసం ఏకంగా 120 ఎకరాల స్థలం సేకరించారు. ఇందులో ఇప్పటికే భారీ బహిరంగ సభ వేదిక, ప్రతినిధుల కోసం వేరు వేరుగా వేదికలు, ప్రముఖుల కోసం వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 3 రోజుల పాటు ప్రతినిధులకు, కార్యకర్తలకు భోజన సదుపాయాల కూడా విడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాన సభా వేదిక చెర్లోపల్లి గ్రామానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా రహదారి కూడా నిర్మిస్తున్నారు.
Also Read : పవన్ ప్లానింగ్ అదుర్స్.. త్వరలో మరో కార్యక్రమం
ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురి చేసింది. చివరికి ఒంగోలు మహానాడుతో తెలుగు తమ్ముళ్లు తిరిగి కదనరంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో భారీ విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్తో పాటు అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు కూడా మహానాడు ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇప్పటికే మహానాడు కోసం ప్రత్యేక కమిటీలు కూడా ప్రకటించారు. ఆహ్వాన కమిటీ మొదలు.. మీడియా కమిటీ కూడా మహానాడు పనుల్లో నిమగ్నమయ్యారు. పార్టీ పసుపు పండుగ మహానాడును భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలిసారి కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు. 27వ తేదీన ఉదయం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంపై మహానాడులో చర్చిస్తారు. ఇక 28వ తేదీన ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చ నడుస్తోంది. అలాగే ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి పలు తీర్మానాలను సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించారు. పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు.
Also Read : హెచ్ 1 బీ పై ట్రంప్ సర్కార్ ఫోకస్..?
తీర్మానాలపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక, రాబోయే ఎన్నికల్లో వ్యవహారించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై పొలిట్ బ్యూరో మీటింగ్లో చంద్రబాబు చర్చించనున్నారు. సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుని ఎంపిక, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు ఎలా వివరించాలనే అంశాలపై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తుంది.




