కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇంక ఎవరైనా సూపర్ సిక్స్ హామీల గురించి తప్పుగా మాట్లాడితే.. వాళ్లకు నాలుక మందం అని వ్యాఖ్యానించారు కూడా. ఇక అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కూడా అమలు తేదీలు ప్రకటించారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఇప్పటికే ఫీడ్ బ్యాక్ తీసుకున్న చంద్రబాబు.. ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లాల్సిందే అంటూ నేతలను ఆదేశించారు. చేసిన పనులు చెప్పాల్సిందే అంటూ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
Also Read : ఇజ్రాయిల్ కు చుక్కలు చూపిస్తున్న ఇరాన్.. యుద్ధం మొదలు
ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ తొలి అడుగు విజయయాత్ర నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నెల 23 నుంచి నెల రోజుల పాటు కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ఇంటింటికీ వివరించాలని సూచించారు. లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ ఈ విజయయాత్రలో పాల్గొనాలని.. ప్రచారం చేసే విషయంలో నేతలు, కార్యకర్తలు పోటీ పడాలని సూచించారు. మొదటి ఏడాది ఏం చేశామో చెప్పడంతో పాటు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని.. ఏడాదిలో సాధించిన విజయాలు తట్టుకోలేక ప్రత్యర్ధులు మహిళలను అవమానించడంతో పాటు దాడులకు దిగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : తల్లికి వందనంపై విమర్శలు అందుకే రాలేదా..?
మహానాడు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు.. మహానాడు విజయవంతమైందని సేద తీరొద్దన్నారు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలి.. పార్టీ కోసం కష్టపడేవారికి అవకాశం కల్పించాలని.. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కమిటీల్లో స్థానం కల్పించాలని సూచించారు. కుటుంబ సాధికార సారధిలో ఉంటేనే ఎవరికైనా పదవులు వస్తాయని.. కార్యకర్తలు ఎప్పుడూ డైనమిక్గా ఉండాలన్నారు. జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణా శిభిరాలు నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతామని.. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు కూడా ప్రతి రోజూ పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని.. ప్రజలతో నిత్యం కలుపుగోలుతనంతో మెలగాలని సూచించారు చంద్రబాబు.
Also Read : తన్నుకున్నారు.. కలిశారు.. బకరా చేశారు..!
ఏపీలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు.. విశాఖపట్నంలో ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మూడు రోజులు పాల్గొంటే సర్టిఫికేట్ ఇస్తామన్నారు. హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజంగా మారడానికే దీనికి శ్రీకారం చుట్టామన్నారు. ఏపీని ప్రపంచ పటంలో పెట్టేందుకు చేపట్టిన ఉద్యమమని వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది ఉన్నా పథకం వర్తింపజేస్తామని చెప్పి ఇచ్చామని గుర్తు చేశారు.
Also Read : ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు వస్తాయా..?
కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ముందు సూపర్-6, మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారని.. వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముఖ్య పథకాలన్నీ ఏడాదిలోపే అమలు చేస్తున్నామన్నారు. విచ్చలవిడి అప్పులతో గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10 వేల కోట్లు తల్లికి వందనం పథకాలు విడుదల చేశామని గుర్తు చేసిన చంద్రబాబు.. అయినా బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.




