తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. పార్టీని ఎలా అయినా బలపరచాలని ఆయన నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్ళిన చంద్రబాబు నాయుడు… తెలంగాణా నేతలతో సమావేశం అయి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఇక పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపైన దృష్టి పెట్టాలంటూ పార్టీ నేతలకు ఆయన సూచనలు, సలహాలు ఇచ్చి… ఎన్నికలలో పోటీ చేసే అంశం గురించి వారి ఆలోచనలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది గాని… శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కొన్ని పరిణామాలు కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించాయి. చంద్రబాబు ట్రస్ట్ భవన్ కు వస్తున్నారన్న సమాచారం కార్యకర్తలకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించి, ఆయన కార్యకర్తలను కూడా కలుసుకుంటారని పేర్కొంటూ అందరికీ సందేశం పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అందరూ చంద్రబాబుతో మాట్లాడాలని, తమ సమస్యలు చెప్పుకోవాలని ఎంతో దూరం నుంచి హైదరాబాద్ వచ్చారు. తీరా చూస్తే… ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పైకి వెళ్లి అక్కడ ఉన్న 40 మంది నేతలతో చంద్రబాబు మాట్లాడారు. గత పదేళ్ళ నుంచి వాళ్ళతోనే ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళతో చర్చలు జరిపి… ఆ తర్వాత మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు.
Also Read : తెలంగాణ టిడిపి పై బాబు సంచలన నిర్ణయం
దీనితో కార్యకర్తలు చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేసారు. కార్యకర్తలతో మాట్లాడనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారని, వాళ్ళతో సమావేశం ఇంట్లో పెట్టుకుంటే మీ కోసం గంటల తరబడి ఎదురు చూడం కదా అంటూ అసహనం వ్యక్తం చేసారు. కొందరు కార్యకర్తలు తెలంగాణా నాయకుల పై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఇక నాయకులు కూడా కార్యకర్తలను సముదాయించడం మానేసి, దూషించినట్లు సమాచారం. పార్టీ బలపడాలంటే వాళ్ళతో కాదని కార్యకర్తలతో మాట్లాడాలని, రెండు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జెండా మోస్తున్న మాకు ఎందుకు విలువ ఇవ్వట్లేదని మండిపడుతున్నారు. కొందరు కార్యకర్తలు అయితే ఇక ట్రస్ట్ భవన్ గడప తోక్కేది లేదంటూ వెళ్ళిపోయారు.