సాధారణంగా ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. వాళ్ళను కెలుక్కునే ప్రయత్నం చేయరు అసలు. కాని నిన్న ఏపీ సర్కార్ మాత్రం వారి విషయంలో చాలా కఠినంగా నిర్ణయం తీసుకుంది. ఏమైందో ఏమో తెలియదు గాని 16 మంది ఐపిఎస్ లకు మెమోలు జారీ చేసి… మీకు పోస్టింగ్ లేకపోయినా ప్రతీ రోజు వచ్చి డీజీపీ ఆఫీసులో ఉన్న వెయిటింగ్ హాల్ లో ఉదయం, సాయంత్రం సంతకం చేయాలని చెప్పడం సంచలనం అయింది.
అందులో డీజీ ర్యాంకు అధికారులు, ఐజి ర్యాంక్ అధికారులు, ఎస్పీలు కూడా ఉన్నారు. ఎందుకు డీజీపీ వాళ్ళ విషయంలో అంత కఠినంగా ఆదేశాలు ఇచ్చారు అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ. దానికి ప్రధాన కారణం… వేరే ఉంది అంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఐపిఎస్ లు ప్రయత్నాలు చేసినట్టు గుర్తించారు. వెయిటింగ్ లో ఉన్న అధికారులు… వైసీపీ నేతలపై ఉన్న కేసుల్లో వారి పాత్రను తగ్గించే విధంగా ఇతర సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారట.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక కేసులను బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెవరిని అరెస్ట్ చేయాలి అనే దానిపై కూడా వారి వారి కేసుల ఆధారంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాలను తెలుసుకుంటున్న కొందరు ఐపిఎస్ అధికారులు ఇప్పుడు సదరు కేసులను నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిఘా విభాగం సమాచారం సేకరించి ప్రభుత్వ పెద్దలకు అందించడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐపిఎస్ అధికారుల విషయంలో కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి