మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కాగా… రోజుల వ్యవధిలోనే లోకేష్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. దీనితో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలయింది. వాస్తవానికి లోకేష్… బిజీ షెడ్యూల్ తో హడావుడిగా ఉన్నారు. కాని ఢిల్లీ వెళ్ళడం, కేంద్ర హోం మంత్రిని కలవడం వంటివి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. నేరుగా ఆయన అమిత్ షా ఇంటికే వెళ్ళారు.
అమిత్ షాను కలిసి ఆయనకు ఓ శాలువాతో సత్కారం కూడా చేసారు. ఈ ఫోటోలు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయి. అమిత్ షాతో లోకేష్ ఏం చర్చించి ఉండవచ్చు అనేది వైసీపీ వర్గాల్లో కాస్త ఆందోళన రేపుతోంది. లోకేష్ ఢిల్లీ వెళ్ళడం చాలా అరుదు. వెళ్లి హోం మంత్రిని కలవడం అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కీలక పరిణామాలు ఉండవచ్చు. ఇటీవల పలు కీలక కేసులు… సర్కార్ సిఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్ కేసు కూడా ఉంది. ఈ కేసులో ఐపిఎస్ అధికారులను సస్పెండ్ కూడా చేశారు.
Also Read : బోరుగడ్డ ఇంట్లో కీలక పత్రాలు స్వాధీనం
దీనిపై అమిత్ షా వద్ద చర్చ జరిగినట్టు సమాచారం. అదే విధంగా గత ప్రభుత్వం చేసిన పలు అవినీతి కార్యక్రమాలకు సంబంధించి త్వరలోనే కీలక అరెస్ట్ లు రాష్ట్ర ప్రభుత్వం చేయనుందని… దీనికి కేంద్రం నుంచి సహకారం కావాలని లోకేష్ కోరి ఉంటారని కొందరు అంటున్నారు. కీలక శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించి లెక్కలతో సహా అమిత్ షా ముందు లోకేష్ ఉంచినట్టు సమాచారం. వీటిపై చర్యలకు శ్రీకారం చుడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే కొందరికి లుక్ అవుట్ నోటీసులు కూడా త్వరలోనే జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అని పలువురిలో ఆందోళన వ్యక్తమవుతోంది.