ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. రతన్ టాటాను దేశం ఓ వ్యాపారవేత్తగా కంటే దేశ భక్తుడిగా, సౌమ్యుడిగా, నిగర్విగా, సేవా మూర్తిగానే చూస్తోంది. తన చేతలతో నేటి తరానికి కూడా దగ్గరయ్యారు రతన్ టాటా. మూడు రోజుల క్రితం తాను కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లాను అని స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేసిన రతన్ టాటా ఆ తర్వాత తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 1991 లో టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రతన్ టాటా… అక్కడి నుంచి టాటా సంస్థను లాభాల్లో నడిపారు.
దేశీయంగా భారత ఆటో మొబైల్ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా ఉందని నిరూపించారు. టీసీఎస్ ద్వారా దేశానికి బలమైన ఐటి కంపెనీలను అందించే సామర్ధ్యం ఉందని చాటారు. ఇక ఉప్పు నుంచి విమానం వరకు టాటా కంపెనీ సాధించిన ఘనతల్లో రతన్ టాటాదే కీలక పాత్ర. ఇండికా కారు దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి కారు నుంచి… బ్రిటీష్ కార్ల తయారీ కంపెనీలు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను కోనేవరకు టాటా మోటార్స్ స్థాయిని పెంచారు. ఇక బ్రిటీష్ స్టీల్ కంపెనీని కొని టాటా స్టీల్ ను విదేశాల్లో విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.
Also read : పులివెందులలో ముదురుతున్న కుటుంబ పోరు.. ఆందోళనలో జగన్
ఇక స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో కూడా రతన్ టాటాది అందే వేసిన చేయి. టాటా గ్రూప్ తో సంబంధం లేకుండా స్టార్టప్ కంపెనీలను వ్యక్తిగతంగా ఆయన ప్రోత్సహించేవారు. లెన్స్ కార్ట్, పేటీఎం సహా ఎన్నో అలా వృద్దిలోకి వచ్చినవే. ఇక టాటా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ఆయన పెద్ద ఎత్తున నిర్వహించారు. అమెరికాలో తాను చదువుకున్న యూనివర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చి సంచలనం సృష్టించారు. ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలతో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది.
ముఖ్యంగా విశాఖ తో రతన్ టాటా అనుబంధం ఉంది. ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రతన్ టాటా… అప్పుడు కీలక ప్రసంగం చేసారు. 2018 డిసెంబర్ 10న ఏయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరు అయ్యారు. అప్పట్లో టాటా ట్రస్ట్ కు చైర్మన్ గా రతన్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది దశాబ్దాల కాలంలో ఏయూ సాధించిన ఘనతను విని ఆకట్టుకున్నట్లు చెప్పారు. ఏయూ విజయాలు, విశ్వవిద్యాలయం గొప్ప నాయకత్వం, దేశానికి సహకారం గురించి విని నేను ఆశ్చర్యపోయానన్నారు రతన్ టాటా. రతన్ టాటా లేని లోటు భారత పారిశ్రామిక రంగం పూడ్చలేనిది. ఉప్పు నుంచి ఉక్కు వరకు విలువలు పాటిస్తూ వ్యాపారం చేయడం అందరికీ సాధ్యం కాదు. ఈరోజు దేశం ఒక నిజమైన భారత రత్నాన్ని కోల్పోయింది.