పెమ్మసాని చంద్రశేఖర్.. ఇప్పుడు తెలుగు మీడియాలో ఎక్కువగా వినపడుతున్న పేరు. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న నాయకుడు. 2024 ఎన్నికల్లో ఆయన దూకుడు చూసిన చాలామంది.. భవిష్యత్తులో టిడిపికి బలమైన నాయకుడు దొరికాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ చేసే విమర్శలకు అప్పట్లో ఆయన స్పందించిన విధానం చాలామందికి నచ్చింది. వైసీపీ ఏ స్థాయిలో రెచ్చిపోయినా.. సబ్జెక్ట్ ఆధారంగా పెమ్మసాని రెస్పాండ్ అవుతూ ఉంటారు.
Also Read : గ్రేటర్ బెజవాడ కొత్త లెక్క.. మొత్తం 75 గ్రామాలతో.. మండలాలు ఇవే
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పెమ్మసాని లో అదే దూకుడు కనపడుతోంది. రాజకీయంగా ఎంత బలంగా ఉన్నాము అనే విషయం పక్కనపెడితే.. తప్పుడు ప్రచారానికి ఎలా సమాధానం చెప్పాలో అదే విధంగా చెప్తూ దూసుకుపోతున్నారు. తాజాగా విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెడుతున్న అంశంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు.. అర్థవంతంగా సమాధానం చెప్పారు పెమ్మసాని. గూగుల్ వస్తే లాభాలేంటో స్పష్టంగా వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక పెమ్మసానిలో దూకుడు చూసిన సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా కేంద్రమంత్రికి అప్పగించారు.
Also Read : మంత్రి పదవి పోవడం ఖాయమా..?
తన పార్లమెంటు పరిధిలో ఉండే అమరావతిలో గతంలో జరిగిన తప్పుల పై కూడా ఆయన ప్రజల్లోకి వెళ్లే విధంగా వివరించారు. జగనన్న కాలనీల్లో జరిగిన అవినీతిపై కూడా పెమ్మసాని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా బెంగళూరు నుంచి వస్తున్న కొన్ని కామెంట్స్ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటుపై పలు రాష్ట్రాలు చేస్తున్న కామెంట్స్ కు రియాక్ట్ అయ్యారు. ఎకో సిస్టం అభివృద్ధికి అనేక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకసారి ఎకో సిస్టం ఏర్పాటు అయ్యాక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదని, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఎకో సిస్టం ఏర్పాటు అయిందని, విశాఖ తో పోలిక అవసరం లేదన్నారు. గూగుల్ సంస్థ ఏర్పాటు తర్వాత చాలా సంస్థలు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సబ్జెక్ట్ రూపంలో పెమ్మసాని కౌంటర్ ఇవ్వడంతో టిడిపి కార్యకర్తలు వాటిని మరింత ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు.