తెలంగాణలో మరోసారి ఉప ఎన్నిక జరగనుందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై స్పీకర్ కాలయాపన చేస్తున్నారని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Also Read : గ్రాండ్గా అఖండ 2 ప్రీ రిలీజ్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పీకర్.. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారు. వీరిలో 8 మంది ఇప్పటికే స్పీకర్ ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. తామంతా పార్టీ మారలేదని.. నియోజకవర్గం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో సమావేశమైనట్లు వెల్లడించారు. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు.
అయితే బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై మాత్రం వేటు ఖాయమనే మాట వినిపిస్తోంది. వారిలో ఒకరు దానం నాగేందర్ కాగా.. మరొకరు కడియం శ్రీహరి. తాజాగా వీరిద్దరిపై వేటు ఖాయమంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం పోటీ చేశారు. ఆ ఎన్నికలో రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో దానం పేరు ఉంది. ఈ రెండు రుజువులను బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు సమర్పించారు. వీటి ఆధారంగా దానంపై వేటు ఖాయమనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. మరో ఆరేళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు దానం అర్హత కోల్పోతారు. అందుకని ముందే రాజీనామా చేసేందుకు దానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఉప ఎన్నికలో గెలిస్తే.. మళ్లీ 3 ఏళ్ల పాటు ఎమ్మెల్యే పదవి ఉంటుందనేది దానం ఆలోచన.
Also Read : భారత్ పై పాక్ దే విజయం.. అమెరికా సంచలన కామెంట్
ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కడియం కుమార్తె డాక్టర్ కావ్య కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కావ్య గెలుపు కోసం శ్రీహరి జోరుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ కండువాలతో ఉన్న ఫోటోలు, వీడియోలను బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు రుజువులుగా సమర్పించారు. దీంతో కడియంపై కూడా వేటు ఖాయమంటున్నారు. తాజాగా జరిగిన విచారణకు కూడా కడియం శ్రీహరి గైర్హాజరయ్యారు. దీంతో వేటు పడుతుందని ముందే ఊహించిన కడియం శ్రీహరి.. త్వరలో రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. త్వరలో తెలంగాణలో మరో రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమనే మాట వినిపిస్తోంది.

