రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చి అధికార పార్టీలో చేరడం అనేది సాధారణ విషయం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ చేరికలు ఎక్కువయ్యాయి. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి రావడానికి కొందరు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు కొందరు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని పై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అందులోకి వెళ్లి టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పార్టీ మారేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చిందని.. వాళ్ల సొంత లాభాల కోసం వైసిపిని వీడినట్లు షో చేస్తూ టిడిపిలోకి వచ్చే వారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. చిన్న చిన్న నామినేటెడ్ పదవులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీల లాంటి వాటి కోసం గానీ, నీటి పారుదల సంఘాల అధ్యక్ష పదవుల కోసం గానీ ఇతరత్రా పదవుల కోసం గానీ, లోగడ తప్పులు చేసి వాటి నుండి తప్పించుకోవడానికి గానీ పార్టీలోకి చేరి మరల వారు ఈ పదవులు పొంది తిరిగి ఆ పార్టీ వారికి అనుకూలంగా ఉంటారని, అటువంటి వారి ఎత్తుగడలు చెల్లవని చంద్రబాబు సూటిగా చెప్పేశారు.
అటువంటి వారిని పార్టీలోకి చేర్చుకోవద్దని కార్యకర్తలను, నాయకులను చంద్రబాబు ఆదేశించారు. నిజాయితీగా పార్టీలో తిరిగే వారికే పదవులు గాని, నాయకత్వం గానీ వస్తుందని.. రెండు పడవలపై కాలు వేసే వారిని దూరంగా ఉంచాలని, టిడిపిలో ఉంటూ వైసీపీ కోవర్ట్ లుగా పనిచేసే వారిని గుర్తించి వారిని దూరం పెట్టాలని కార్యకర్తలకు నాయకులకు చంద్రబాబు సూచించారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల నేతలు కొందరు పార్టీ మారేందుకు నానా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.