ఈ నెల 27న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు దాదాపు 2 నెలలుగా ప్రచారం నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరంగా ఉండటంతో.. గెలుపు దాదాపు ఖాయమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు కూడా. అయితే సరిగ్గా రెండు రోజుల ముందు జరిగిన గ్రూప్-2 పరీక్ష.. కూటమి నేతలను కలవరపరుస్తోంది. గెలుపు దాదాపు ఖాయమని అంతా ధైర్యంగా ఉన్న సమయంలో గ్రూప్-2 పరీక్ష వివాదం పెద్ద దుమారం రేపింది.
Also Read : ఉమాకు ఈసారి కూడా నిరాశ తప్పదా…?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా ఓట్లు వేసేది ఎక్కువగా నిరుద్యోగులే. వీరిలో సింహభాగం గ్రూప్-2 పరీక్ష కోసం ప్రిపేర్ అయిన వారే ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం చేసిన తప్పునకు ప్రస్తుతం ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది అనేది అందరికీ తెలిసిన విషయమే. 2023 డిసెంబర్లో జగన్ సర్కార్ హడావుడిగా ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రిలిమినరీ పరీక్ష ద్వారా మెయిన్స్కు 92,250 మంది ఎంపికయ్యారు. అయితే రోస్టర్ విధానంలో తప్పుల కారణంగా విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నోటిఫికేషన్లో రోస్టర్ మార్చిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ కూడా చేశారు. ప్రభుత్వం కోరినప్పటికీ ఏపీపీఎస్సీ మాత్రం సాధ్యం కాదని తేల్చిచెప్పేసి పరీక్ష నిర్వహించింది కూడా. దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
Also Read : రేవంత్ను ఎదుర్కోవాలంటే కేసీఆర్కు బీజేపీనే ఆయుధమా…?
అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నిరుద్యోగులను వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు సమస్య తమ వల్లే వచ్చిందనే విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతూ.. నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ వైపు గ్రూప్-2 అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే… మంత్రి నారా లోకేష్ మాత్రం దుబాయ్లో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వైసీపీ విద్యార్థి విభాగం నిరుద్యోగులను రెచ్చగొడుతోంది. నిరుద్యోగుల సత్తా ఏమిటో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్, గోదావరి జిల్లాల నుంచి పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. వీరికి ప్రత్యర్థులుగా సీపీఎం తరఫున పోటీలో ఉన్నారు. గెలుపు ధీమాలో ఉన్న టీడీపీ అభ్యర్థులు.. ఏపీపీఎస్సీ పరీక్షల వల్ల మెజారిటీ తగ్గుతుందని భయపడుతున్నారు.




