వై నాట్ 175 అన్నారు.. కానీ 11 స్థానాలు మాత్రమే రావడంతో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. నిన్నటి వరకు వెన్నంటే నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతున్నారు. వైసీపీ స్థాపించిన నాటి నుంచి జగన్తోనే ఉన్న చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా మర్రి రాజశేఖర్ కొనసాగుతున్నారు.
Also Read : కుప్పం వైసీపీ కొప్పు ఊడుతుందా…?
పార్టీ ఘోర పరాజయం తర్వాత ముఖ్య నేతలంతా ఒక్కొక్కరుగా జగన్కు దూరంగా వెళ్తున్నారు. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్తో పాటు మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య వంటి నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, గ్రంధి శ్రీనివాస్, కిలారు రోశయ్య, పెండ్యం దొరబాబుతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా జగన్కు గుడ్ బై చెప్పేశారు. వీరంతా జగన్ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇదే సమయంలో కార్పొరేషన్లతో పాటు మునిసిపాలిటీల్లో కూడా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీ మారడంతో ఇప్పటికే సగానికి పైగా మునిసిపాలిటీలో కూటమి ఖాతాలో చేరాయి.
Also Read : ఏపీ అసెంబ్లీలో ధూళిపాళ్ళ మరో సంచలనం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యనేతలు పార్టీ వీడుతున్నారు. అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే రావడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే మండలిలో మాత్రం వైసీపీకి మెజారిటీ ఉంది. దీంతో అసెంబ్లీ జరిగిన సమయంలో వైసీపీ నేతలు శాసనసభకు దూరమవుతున్నప్పటికీ.. మండలిలో మాత్రం గట్టిగానే పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు మండలిలో కూడా వైసీపీ బలం క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ చక్రవర్తి పార్టీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అయితే వీటికి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది. ఇప్పుడు మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేయడంతో ఆ సంఖ్య ఐదుకు చేరుకుంది. వాస్తవానికి కొద్ది కాలంగా పార్టీకి మర్రి రాజశేఖర్ దూరంగా ఉంటున్నారు. చిలకలూరిపేట టికెట్ ఆశించిన రాజశేఖర్ను కాదని విడదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత రజనీకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీంతో చిలకలూరిపేటలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఆ తర్వాత మర్రి రాజశేఖర్ను రీజనల్ కో ఆర్డినేటర్గా జగన్ నియమించారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి జగన్ తప్పించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మర్రి రాజశేఖర్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతేడాది డిసెంబర్ నెలలోనే రాజీనామా చేస్తారంటూ పుకార్లు వినిపించాయి. అవి ఇప్పుడు నిజమయ్యాయి. మర్రి రాజశేఖర్ త్వరలో టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై రాజశేఖర్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

