వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పూర్తిగా బెంగళూరు యలహంక ప్యాలెస్కు పరిమితమైన జగన్.. వారంలో 3 రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు. అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్న జగన్ దర్శనం కేవలం నేతలకు మాత్రమే దక్కుతుంది. తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చే కార్యకర్తలకు అధినేత దర్శనభాగ్యం కలగటం లేదు. దీంతో అధినేతపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు.
Also Read : తప్పుడు ప్రచారం ఖాతాలపై గురి.. తొక్కి పట్టి నార తీస్తున్న పోలీసులు
కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత అని చెప్పే జగన్.. ఏడాదిన్నర కాలంగా కార్యకర్తలను కలవటం లేదు. అసలు ఓటమికి కారణాలు ఏమిటనే విషయంపై కూడా ఇప్పటి వరకు నియోజకవర్గం ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలతో చర్చించలేదు కూడా. అయితే ఓడిన తర్వాత ఓ 3 నెలలు దాటిన తర్వాత నుంచి పదే పదే ఒక మాట మాత్రం చెబుతున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తా అని.. 2 రోజుల పాటు బస చేస్తా అని చెబుతున్నారు. ఆ రెండు రోజుల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడుతా అని చెప్పారు. వారి అభిప్రాయాలు తీసుకుంటా అని కూడా చెప్పారు జగన్.
తొలుత ఈ ఏడాది సంక్రాంతి నుంచి జిల్లాల్లో పర్యటిస్తా అని ప్రకటించారు జగన్. ఇదే విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెల్లడించారు. ప్రతి నియోజకవర్గం గురించి జగన్ స్వయంగా చర్చిస్తారని.. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని కూడా సజ్జల తెలిపారు. ఈ ప్రకటన చేసి ఇప్పటికి ఏడాది దాటిపోయింది. అయినా సరే జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదు.
Also Read : జీఎస్టీ ఎఫెక్ట్.. ఏపీలో భారీగా వాహనాల అమ్మకాలు..!
సత్తెనపల్లి, గుంటూరు, బంగారుపాళ్యం, పొదిలిలో పరామర్శల పర్యటనలు చేశారు తప్ప.. నియోజకవర్గాలపై ఇప్పటి వరకు కనీసం దృష్టి పెట్టలేదు. నేతలతో ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఒకటి రెండు నియోజకవర్గాల నేతలను నేరుగా తాడేపల్లికి పిలిపించుకుని ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసి.. పోలీసుల బట్టలూడదీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు తప్ప.. ఓటమికి కారణాలు మాత్రం తెలుసుకోలేదు. తాజాగా పార్టీ నేతలతో సమావేశమైన జగన్.. మరోసారి జిల్లాల పర్యటన గురించి ప్రస్తావించారు. దీపావళి నుంచి జిల్లాలో పర్యటిస్తానన్నారు. ఈ పర్యటనపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. జగన్ ప్రకటనను పార్టీ నేతలే లైట్ తీసుకున్నారు. ఆయన బయటకు వచ్చినప్పుడు చూద్దాంలే అంటున్నారు.