ఏప్రిల్ 22న పహలాగామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన ఖచ్చితమైన దాడుల వివరాలను ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ లక్ష్యాన్ని, చేపట్టిన ఆపరేషన్ ఫలితాలను దేశ ప్రజల ముందు ఉంచారు. ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా “ఆపరేషన్ సిందూర్” ను చేపట్టామని పేర్కొన్నారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ అని ఎందుకు పెట్టారు..?
విశ్వసనీయ నిఘా సమాచారం మేరకు, సరిహద్దు ఉగ్రవాదుల ప్రమేయం ఆధారంగా ఉగ్రవాద స్థావరాలను ఎంపిక చేశామన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్తాన్లో ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు ఆమె ప్రకటించారు. పాకిస్తాన్ సైనికులను ఎక్కడా టార్గెట్ చేయలేదని, అయితే, పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడానికి పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. సమాధానం ఇవ్వడానికి భారత సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని.. అని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ కు జై కొట్టిన అగ్ర దేశాలు
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్, రావలకోట్, చక్స్వరీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వా వంటి తొమ్మిది ప్రదేశాలలో భారత ఆర్మీ 24 క్షిపణి దాడులు నిర్వహించింది, 70 మంది ఉగ్రవాదులను హతమార్చింది. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి మే 6వ తేదీ బుధవారం తెల్లవారుజామున 1.05 గంటలకు ప్రారంభమై కేవలం 25 నిమిషాలు మాత్రమే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.