దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాను మరింత సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనలను తొలగిస్తూ, వినియోగదారులకు ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులకు భారీ ఊరటనిచ్చాయి. ప్రముఖ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన ఛోటూ పేరుతో ఉన్న 5 కిలోల సిలిండర్ల సరఫరాను ముమ్మరం చేసింది. హెచ్పీసీఎల్ కూడా రికార్డు స్థాయిలో సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read : యుద్ధం.. అప్రకటిత లాక్ డౌన్..!
ఈ 5 కిలోల సిలిండర్లను కొనుగోలు చేయడానికి ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ పంపుల వద్ద ఇవి నేరుగా అందుబాటులో ఉంటాయి. ముందస్తు బుకింగ్ అవసరం లేకుండానే వీటిని పొందవచ్చు. మార్చి 23 నుండి ఇప్పటివరకు సుమారు 6.6 లక్షల 5 కిలోల సిలిండర్లు విక్రయించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. సిలిండర్ల అక్రమ విక్రయాలు, హోర్డింగ్ను అరికట్టడానికి ఆయిల్ కంపెనీలు తనిఖీలను ఉధృతం చేశాయి.
Also Read : ఏపీలో మరో రేపిస్ట్ సంగతేంటి..? సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..?
ఇప్పటికే 50 వేలకు పైగా సిలిండర్లను సీజ్ చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన 36 డీలర్ షిప్ లను సస్పెండ్ చేశాయి. గృహ వినియోగదారులు అనవసరంగా ఏజెన్సీల చుట్టూ తిరగకుండా 95% బుకింగ్లను డిజిటల్ పద్ధతుల్లోనే చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 51 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని, వినియోగదారులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆయిల్ కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం డెలివరీ అథెంటికేషన్ కోడ్ వంటి విధానాలను కూడా మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపాయి.

