ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అన్నాడిఎంకే బహిష్కృత నేత, మాజీ సిఎం పన్నీర్ సెల్వం.. సిఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిసిన ఆయన.. ఓ బోకే ఇచ్చి.. ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలంటూ ఆశాభావం వ్యక్తం చేసారు. ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిన సమావేశమే అయినా.. సంచలనంగా మారింది.
Also Read :సోషల్ మీడియాలో జగన్ కామెడీ వైరల్..!
ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో అభిప్రాయ భేదాల కారణంగా పన్నీర్ సెల్వం పార్టీని వీడి ‘ఏఐఏడీఎంకే వాలంటీర్స్ రైట్స్ రికవరీ అసోసియేషన్’ అనే సంస్థ ద్వారా స్వతంత్రంగా పనిచేస్తున్నారు. ఆయన మద్దతుదారులు కొందరు ఇప్పటికే డీఎంకే, టీవీకే లో చేరారు. వైతిలింగం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనవరి 21న డీఎంకేలో చేరారు. మనోజ్ పాండియన్ డీఎంకేలో, జేసీటీ ప్రభాకర్ టీవీకేలో చేరారు. పొత్తు నిర్ణయం విషయంలో పన్నీర్ సెల్వం ఆలస్యం చేయడంతో, ఆయన మద్దతుదారులు ఒక్కొక్కరుగా ప్రత్యామ్నాయ పార్టీలలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
Also Read :బొత్సకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!
మరోవైపు ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడానికి చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్టాలిన్ తో హఠాత్తుగా సమావేశం కావడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. అయితే, ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకమైన సమావేశమని, రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తమిళ మీడియా వర్గాలు అంటున్నాయి. ప్రేమలత విజయకాంత్ డీఎంకే కూటమిలో చేరిన తర్వాత, పన్నీర్ సెల్వం కూడా డీఎంకేలో చేరుతారని అంచనా వేస్తున్నారు.

